India vs China: చైనాపై భారత్ సీరియస్.. ఊరుకునేది లేదంటూ..
ABN , Publish Date - May 14 , 2025 | 10:18 AM
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా చేసిన పనికి సీరియస్ అయింది భారత ప్రభుత్వం. ఊరుకునేది లేదంటూ పొరుగు దేశంపై మండిపడింది. అసలేం జరిగిందంటే..

భారత్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. పహల్గాం దాడి తర్వాత ఉగ్రస్థావరాల మీదకు ఇండియా అటాక్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. అలాగే ప్రతిదాడి చేసిన పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పడుతున్నాయి. ఈ తరుణంలో భారత్ను లక్ష్యంగా చేసుకుంది పొరుగు దేశం చైనా. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చింది. అసలే పాక్ చేసిన అతితో గరంగరంగా ఉన్న భారత్ను పేర్ల మార్పుతో రెచ్చగొట్టింది డ్రాగన్ కంట్రీ. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చింది మోదీ సర్కారు.
ఎప్పటికీ మాదే..
అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా మీద సీరియస్ అయింది భారత్. ఇది వృథా అని, ఇలాంటి అహంకారపూరిత చర్యల్ని సహించేది లేదని స్పష్టం చేసింది. అరుణాచల్లోని కొన్ని ఏరియాలకు చైనా పేర్లు పెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది వృథా ప్రయత్నమని మండిపడింది ఇండియా. డ్రాగన్ కంట్రీ వ్యర్థ, విఫలయత్నాలను తాము గమనిస్తూనే ఉన్నామని స్పష్టం చేసింది. అరుణాచల్ ఎప్పటికీ తమ భూభాగమేనని తేల్చిచెప్పింది. పేర్లు మార్చినంత మాత్రాన నిజాలు మారవంటూ చైనాపై భగ్గుమంది. కాగా, అరుణాచల్ ప్రదేశ్ను జాంగాంగ్ అనే పేరుతో పిలుస్తోంది డ్రాగన్ కంట్రీ. దీన్ని టిబెట్ దక్షిణ భూభాగంగా పరిగణిస్తోంది. గతేడాది ఇలాగే అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాల పేర్లను మార్చి లిస్ట్ రిలీజ్ చేసింది. అలాగే అరుణాచల్ను తమ దేశ మ్యాప్లో జోడించి కొత్త మ్యాప్ను కూడా విడుదల చేసింది. అయితే వీటిని భారత్ కొట్టిపారేసింది.
ఇవీ చదవండి:
అబద్ధాల ఫ్యాక్టరీ.. పాకిస్థాన్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి