India Pakistan War Scenario: ఉగ్రదాడి నుంచి కాల్పుల విరమణ దాకా
ABN , Publish Date - May 11 , 2025 | 04:17 AM
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఆపరేషన్ సిందూర్తో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, అమెరికా హస్తక్షేపంతో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.

పహల్గాం దాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు
ఆపరేషన్ సిందూర్తో కమ్ముకున్న యుద్ధ మేఘాలు
దాడులు, ప్రతిదాడులతో దాయాది దేశాల్లో టెన్షన్
అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు ఓకే
న్యూఢిల్లీ, మే 10 : పహల్గాంలో జరిగిన హేయమైన ఉగ్రదాడి భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణానికి తెరతీసింది. కశ్మీర్లో అమాయక పర్యాటకులు 26 మందిని ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా కాల్చి చంపడం యావత్ భారతావనిలో ఆగ్రహావేశాలను రేకేత్తించింది. ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో గట్టిగా బదులివ్వాలని పౌరుల నుంచి బలమైన అభిప్రాయం వ్యక్తమైంది. ఉగ్ర దాడికి దీటైన జవాబు ఇచ్చేందుకు వ్యూహ రచన చేసిన భారత్.. పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్ర స్థావరాలు, శిక్షణా కేంద్రాలను లక్ష్యం చేసుకుంది. కచ్చితమైన దాడులతో మే 6న అర్ధరాత్రి దాటాక ఉగ్ర మూకలపై విరుచుకుపడింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. దాడులతో రగిలిపోయిన పాకిస్థాన్ భారత్పైకి అనేక క్షిపణులు, డ్రోన్లను పంపింది. అయితే, వాటిని మన దేశ రక్షణ వ్యవస్థలు సమర్థంగా కూల్చివేశాయి. చేసేదేం లేక పాకిస్థాన్ సైన్యం సరిహద్దుల్లోని అమాయక భారత పౌరులపై నిత్యం కాల్పులు జరుపుతూ వచ్చింది. ఈ పరిణామాలు ముదురుతూ దాయాదుల మధ్య ఇక యుద్ధం తప్పదేమోననే వాతావరణాన్ని కల్పించాయి. అయితే, అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి.
పహల్గాం దాడి నుంచి జరిగిన పరిణామ క్రమం ఇలా..
ఏప్రిల్ 22 : జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో లష్కర్-ఈ-తయీబా ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులను చంపేశారు.
ఏప్రిల్ 23 : ఉగ్ర దాడితో పాక్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్.. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అటారీ-వాఘా సరిహద్దులను మూసివేసింది. ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టింది.
ఏప్రిల్ 24 : పాక్ వీసాలను భారత్ రద్దు చేసింది. ప్రతిగా పాకిస్థాన్ కూడా భారత వీసాలను రద్దు చేసింది. ఇరు దేశాలు ప్రత్యర్థి దేశాల పౌరులు దేశాన్ని వీడి వెళ్లాలని గడువును విధించాయి. పాక్ గగన తలంపై భారత విమానాలను నిషేధించింది. భారత్తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను బంద్ చేసింది. భారత్పై అణు బాంబులు వేస్తామని పాక్ మంత్రులు హెచ్చరించారు.
ఏప్రిల్ 25 : నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ విచ్చలవిడిగా కాల్పులు జరపడం ప్రారంభించి సరిహద్దుల్లో ఉద్రిక్తతను పెం చింది. సంయమనం పాటించాలని అమెరికా సహా ఇతర దేశాలు పాక్కు సూచించాయి.
ఏప్రిల్ 30 : సరిహద్దుల వెంబడి పాక్ వరుసగా ఐదో రోజూ రాత్రి కాల్పులు జరిపింది. మరో 24 నుంచి 36 గంటల్లో భారత్ తమపై మిలిటరీ దాడి చేస్తుందన్న కచ్చితమైన సమాచారం ఉందని పాక్ సమాచార మంత్రి అట్టాఉల్లా తరార్ ప్రకటించారు.
మే 1 : భారత్-పాక్ సంయమనం పాటించాలని ఇరు దేశాల సీనియర్ అధికారులతో మాట్లాడానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ప్రకటించారు.
మే 3 : 450 కి.మీ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణిని పాక్ పరీక్షించింది. తమ దేశం మీదుగా పాక్కు విమానాలు వెళ్లకుండా భారత్ గగనతలాన్ని మూసివేసింది. పాక్ నౌకలు భారత పోర్టులకు రాకుండా నిషేధించింది.
మే 7: ఉగ్రదాడికి బదులు ఇచ్చేందుకు వ్యూహ రచన చేసిన భారత ఆర్మీ మే 6న అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. 1.04 గంటలకు పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్ర నేతలతో పాటు అనేక మంది ఉగ్రవాదులు చనిపోయారు.
మే 8 : జమ్మూ కశ్మీర్, పంజాబ్లోని పలు ప్రాంతాల్లో మే 8న రాత్రి డ్రోన్లు, భారీ శతఘ్నులతో పాకిస్థాన్ దాడులు చేసింది. వాటిని సమర్థంగా తిప్పికొట్టిన భారత్.. బలమైన ప్రతీకార దాడులు చేసింది. సియాల్కోట్, ఇస్లామాబాద్లో భారత్ డ్రోన్ దాడులు చేసింది. పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుడు సంభవించింది.
మే 9 : పాకిస్థాన్ దాడులకు బదులిచ్చే క్రమంలో ఆ దేశ గగన తల రక్షణ వ్యవస్థ హెచ్క్యూ-9బీ ను భారత్ ధ్వంసం చేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో టీ-20 మ్యాచ్లను వారం పాటు భారత్ రద్దు చేసింది.
మే 9 రాత్రి: ఆయుధాలు, మందుగుండుతో కూడిన అనేక డ్రోన్లతో పాటు ఫతా క్షిపణులతో పశ్చిమ సరిహద్దుల వెంట ఉన్న 26 ప్రాంతాల్లో పాక్ దాడులకు తెగబడింది.
మే 9 అర్ధరాత్రి: పాక్ చర్యకు దీటైన జవాబిచ్చే క్రమంలో ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో భారత ఆర్మీ భారీ దాడులు చేసింది. సియాల్కోట్, అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి.
మే 10 ఉదయం: పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ సహా 8 ప్రధాన ఎయిర్బే్సలను భారత్ ధ్వంసం చేసింది. స్కర్దూ, బొలారీ, సర్గోంధా సహా మరో 8 ప్రాంతాల్లో ఎయిర్స్ట్రి్పలు నాశనమయ్యాయి.
మే 10 మధ్యాహ్నం: దాడుల విషయంలో సంయమనం పాటించాలని భారత్, పాక్ ప్రధాన మంత్రులు, రక్షణ శాఖ సలహాదారులతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చర్చలు జరిపారు.
మే 10 మధ్యాహ్నం 3.35 గంటలు : పాకిస్థాన్ మిలిటరీ డైరెక్టర్ జనరల్ భారత్ వైపునకు వచ్చి చర్చలు జరిపారు.
మే 10 సాయంత్రం 5 గంటలు : ఇరు దేశాల మధ్య చర్చల అనంతరం భారత్ కాల్పుల విరమణను ప్రకటించింది.
Also Read:
అధికారిక, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు..
లేడీ లాయర్ గ్యాంబ్లింగ్ పిచ్చి.. 74 కోట్లు కాజేసింది..
For More National News and Telugu News..