Share News

Ashwini Vaishnav: మేడిన్ ఇండియా చిప్ వచ్చేస్తోంది.. మోదీ సర్కారు మాస్టర్‌స్ట్రోక్

ABN , Publish Date - May 29 , 2025 | 08:00 PM

త్వరలో మేడిన్ ఇండియా తొలి చిప్ రాబోతోంది. ఈ విషయంపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ పురోగతిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Ashwini Vaishnav: మేడిన్ ఇండియా చిప్ వచ్చేస్తోంది.. మోదీ సర్కారు మాస్టర్‌స్ట్రోక్
Ashwini Vaishnav

ఈ సంవత్సరం ఆఖరు నాటికి తొలి మేడిన్ ఇండియా చిప్‌ను తీసుకురానున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దేశ సాంకేతిక రంగ స్వావలంబనలో ఇది కీలకమైన ముందడుగా నిలుస్తుందని చెప్పారు. సీఐఐ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన.. సెమీకండక్టర్ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మేం ఓ విభాగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. దీనికి 60 శాతం మార్కెట్‌ ఉంది. ప్రస్తుతం 6 యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. తొలి మేడిన్ ఇండియా 28-90 ఎన్‌ఎం చిప్‌ను ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. 2022లోనే దీని తయారీని మొదలుపెట్టాం’ అని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.


రెండూ కీలకమే..

సేవా రంగం మీద ఫోకస్ చేయాలని చాలా మంది ఆర్థికవేత్తలు సూచించారని మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. అయితే సేవా రంగంతో పాటు ఉత్పాదకత మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని.. గణనీయ అభివృద్ధికి ఈ రెండూ కీలకమని మంత్రి పేర్కొన్నారు. దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌కు ప్రత్యేకమైన ఇంటర్నెట్ ప్రోటోకాల్, ప్రొడక్ట్, డిజైన్, స్టాండర్డ్స్ ఉండాలని.. వీటి ఆవశ్యకత ఉందన్నారు అశ్వినీ వైష్ణవ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భారీ మార్పులకు అవకాశం ఏర్పడిందన్నారు. అన్ని రంగాలతో పాటు మన సమాజంలోనూ ఏఐ గణనీయ మార్పులు తీసుకురాబోతోందని పేర్కొన్నారు. ఈ మార్పులకు అందరమూ సంసిద్ధంగా ఉండాలన్నారు. భారతీయ సంస్కృతి, భాషలపై ప్రత్యేకమైన ఏఐ మోడల్స్‌ను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు అశ్వినీ వైష్ణవ్.


ఇవీ చదవండి:

సంతకాలు చేస్తారు.. డెలివరీలు జరగవు

యూనీఫామ్ లేని యుద్ధ వీరుడు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 29 , 2025 | 08:15 PM