Heavy Rains Disrupt Flights: ఢిల్లీలో భారీ వర్షాలు.. విమాన ప్రయాణికులకు కీలక సూచన
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:07 AM
దిల్లీలో ఈరోజు భారీ వర్షం కురుస్తోంది. దీంతో విమానయాన సంస్థలు ప్రయాణీకులకు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. గాలులతో కూడిన ఈ వర్షం వల్ల విమాన సేవల్లో జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు భారీ వర్షం కురుస్తోంది. ఈ ప్రభావం విమాన ప్రయాణాలపై కూడా పడింది. ఈ నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు ముందుగానే అప్రమత్తమై ప్రయాణికులకు ప్రయాణ సూచనలు జారీ చేశాయి. దీంతో విమానాల ఆలస్యం, రద్దులు సంభవించే అవకాశం ఉందని తెలియజేశాయి.
ఎయిర్ ఇండియా హెచ్చరిక
ఈ క్రమంలో ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు సోషల్ మీడియా ఎక్స్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఢిల్లీలో వర్షం కారణంగా విమాన సర్వీసులు ప్రభావితమయ్యే అవకాశముందని తెలిపింది. విమానాశ్రయానికి బయలుదేరేముందు మీ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని తెలిపింది. ఢిల్లీలో వర్షం కారణంగా మిగతా షెడ్యూల్స్ ఆలస్యం అవుతాయని, సిబ్బంది పరిమితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
స్పైస్ జెట్ హెచ్చరిక
స్పైస్ జెట్ కూడా ఇదే రీతిలో ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీ (DEL), ధర్మశాల (DHM) ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు కలకలం రేపుతున్నాయని తెలిపింది. ఢిల్లీ, ధర్మశాలలో వాతావరణం ప్రభావంతో వచ్చే/వెళ్లే విమాన సర్వీసులు, అలాగే వాటి అనుబంధ సర్వీసులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకుని ప్రయాణించాలని పేర్కొంది.
ఇండిగో కూడా..
ఇండిగో కూడా తన ప్రయాణికులకు వర్షం సంబంధిత హెచ్చరికను జారీ చేసింది. ఢిల్లీలో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. మీ ప్రయాణానికి కొంత అదనపు సమయం కేటాయించండి. మేము మీ ప్రయాణాన్ని భద్రంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ క్రమంలో విమానాల ఆలస్యం సహా ఎటువంటి సహాయం అవసరమైనా మేమున్నామని ట్వీట్ చేసింది.
వర్షాలు మరికొన్ని రోజులు
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఈ వర్షపాతం ఈ రోజు మధ్యాహ్నం నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం, వర్షాలు జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు కొనసాగుతాయని తెలుస్తోంది. మండుటేండల నుంచి ఊపిరి తీసుకుంటున్న ఢిల్లీ వాసులకు వర్షం ఊరటగా కనిపించినా, నగరంలోని పలు ప్రాంతాల్లో జలమయం కావడం వల్ల ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే సోమవారం నుంచి కొనసాగుతున్న వర్షాలతో అనేక ప్రాంతాల్లో నీటిమట్టం పెరిగి ట్రాఫిక్ నిలిచిపోయిన దృశ్యాలు కనిపించాయి.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్బీఐ క్లర్క్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి