AV Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..
ABN , Publish Date - Jul 29 , 2025 | 10:28 AM
హైడ్రా నగరానికి రక్షణగా నిలిచిందని, ఆక్రమణదారుల పట్ల బుల్డోజర్లా వ్యవహరించిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యల గురించి కమిషనర్ సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

- నగరానికి రక్షణ కవచంగా.. హైడ్రా
- అక్రమణదారుల గుండెల్లో నిలిచాం
- కబ్జాదారులపై కఠినంగా వ్యవహరించాం
- హఫీజ్పేటలో 1,950 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి
- హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్: హైడ్రా నగరానికి రక్షణగా నిలిచిందని, ఆక్రమణదారుల పట్ల బుల్డోజర్లా వ్యవహరించిందని కమిషనర్ రంగనాథ్(Commissioner Ranganath) తెలిపారు. హైడ్రా ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యల గురించి కమిషనర్ సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కబ్జాచెరలో ఉన్న ప్రభుత్వ భూములను విడిపించామని, అనధికారిక నిర్మాణాలను కూల్చివేశామని, నాలాలు, రోడ్లకు విముక్తి కల్పించామని వివరించారు.
శేర్లింగంపల్లి మండలం హఫీజ్పేటలో 39ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కబ్జా చేసి విల్లాలు నిర్మిస్తే అక్రమ నిర్మాణాలను కూల్చి వేశామని పేర్కొన్నారు. ఆ భూమి విలువ రూ.1,950 కోట్లు ఉంటుందని తెలిపారు. శామీర్పేట మండలం దేవరాయాంజల్, కండ్లకోయలో న్యాయస్థాన సముదాయానికి ప్రభుత్వం కేటాయించిన భూమిని, రెండు గ్రామాలకు వెళ్లే రోడ్డును నర్సింహారెడ్డి అనే వ్యక్తి కబంధహస్తాల నుంచి విముక్తి చేసినట్లు తెలిపారు.
గచ్చిబౌలిలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ సొసైటీని అభివృద్ధి చేసింది. దాని పక్కనే శ్రీధర్రావు అనే వ్యక్తి ఓ కన్వెన్షన్ను నిర్మించి సొసైటీ లేఅవుట్లోని రోడ్లు, పార్కులు, ఖాళీ స్థలాలను ఆక్రమించారని తెలిపారు. సొసైటీ ఫిర్యాదుతో ఆక్రమణలను తొలగించామన్నారు. కమిషనర్గా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా తన బాధ్యతలను నిర్వర్తించానని వివరించారు.
ఏడాదిలో తొలగించిన ఆక్రమణలు
హైదరాబాద్ పరిధిలో 185 చెరువులకు ఒక రూపు తెచ్చేందుకు హైడ్రా ప్రణాళికలు రూపొందించిందన్నారు. ప్రముఖ సినీ హీరో నాగార్జున తుమ్మిడికుంట చెరువు దగ్గర నిర్మించిన ఎన్ కన్వెన్షన్ను కూల్చి వేసి, ఆ చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించామన్నారు. చందానగర్ సర్కిల్ ఈర్ల చెరువు బఫర్జోన్ పరిధిలోని నిర్మాణాలను కూల్చివేశామన్నారు. మెట్టుగూడలో ప్రభుత్వ పాఠశాలకు రహదారి లేదని ఫిర్యాదు రావడంతో దారి చూపామన్నారు. పోచారం మున్సిపాలిటీ దివ్యానగర్ లేఅవుట్లో వెళ్లేందుకు వీల్లేకుండా నిర్మించిన ప్రహరీని కూల్చివేసి దారి చూపామని వివరించారు. పాతబస్తీ వంటి చోట్ల కూడా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్కు చెందిన 5 అంతస్తుల భవనాన్ని కూల్చి వేశామని పేర్కొన్నారు. చెరువుల రక్షణతోపాటు నగరంలో వరదల నివారణకు, అగ్నిప్రమాదాల నివారణకు హైడ్రా పని చేస్తుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు
ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు
Read Latest Telangana News and National News