Share News

Rains: నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

ABN , Publish Date - Jun 12 , 2025 | 10:32 AM

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న క్రమంలో రానున్న నాలుగురోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, నీలగిరి జిల్లాలో ఈ నెల 14వ తేదీన భారీ వర్షం కురుస్తుందని వాతావారణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది.

Rains: నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

- వాతావరణ శాఖ వెల్లడి

చెన్నై: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న క్రమంలో రానున్న నాలుగురోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, నీలగిరి జిల్లాలో ఈ నెల 14వ తేదీన భారీ వర్షం కురుస్తుందని వాతావారణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. మరోవైపు రానున్న 12 గంటల్లో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది ఉత్తర దిశగా కదులుతోందని, రాగల 36 గంటల్లో మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని ఆ శాఖ పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 17వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.


సముద్రంలో గంటకు 40-50 కిమీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పర్వతశ్రేణులు, జలపాతాలు అధికంగా కలిగిన జిల్లాల్లో బుధవారం నుంచే వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో గత వారంరోజుల వరకు అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతలతో తల్లడిల్లిన ప్రజలు, సోమవారం నుండి కురుస్తున్న మోస్తరు వర్షాలతో భూమి చల్లబడుతుండటంతో ఉపశమనం పొందుతున్నారు.


వాతావరణంలో కలిగిన మార్పులతో బుధవారం తిరువణ్ణామలై, రాణిపేట, వేలూరు(Ranipet, Veluru), తిరుపత్తూరు, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, కడలూరు, అరియలూరు, మైలాడుదురై, నాటపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అదేవిధంగా గురువారం కోయంబత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలైన నీలగిరి, తేని, తిరువళ్లూరు, రాణిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. 13వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం అధికంగా నమోదవుతుందని తెలిపింది.

nani1.2.jpg


ఏడు జిల్లాల కలెక్టర్లకు...

నీలగిరి, దిండుగల్‌, తేని, తెన్‌కాశి, తిరునల్వేలి, కన్నియాకుమారి, కోయంబత్తూరు జిల్లాల్లో ఈ నెల 17వ తేదీవరకు వర్షాలు భారీగా కురిసే అవకాశమున్నందువల్ల ప్రజలకు నష్టం కలుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిందిగా ఈ జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. వర్షం కారణంగా వరద సంభవించే ప్రాంతాల్లో సహాయ చర్యల నిర్వహణకు ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బలగాలను సిద్ధం చేసుకోవాలని ఆ శాఖ ఆదేశించింది.


నీలగిరి జిల్లాకు రెడ్‌ అలెర్ట్‌...

పర్వతశ్రేణులు, జలపాతాలు అధికంగా ఉన్న నీలగిరి జిల్లాలో శుక్రవారం నుండి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. వచ్చే శని, ఆదివారాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ఈ జిల్లాకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. శనివారం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షం కురుస్తుందన్నది వాతావరణశాఖ నిపుణుల అంచనా. జిల్లాలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన తాగునీరు, పాలు, ఆహార ధాన్యాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి సూచించారు.


16వ తేదీ జిల్లాలోని పలు ప్రాంతాలు, అలాగే కోయంబత్తూరు జిల్లాలోని కొండ ప్రాంతాలు, తిరునల్వేలి, తేని, దిండుగల్‌, తెన్‌కాశి, కన్నియాకుమారి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 15వ తేదీ నీలగిరి జిల్లాలో ఊటీ, కోతగిరి, ఎమరాల్డ్‌ తదితర ప్రాంతాలు, తిరునల్వేలి జిల్లాలో కొండ ప్రాంతాలు, తెన్‌కాశి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముంది. కాగా, చెన్నై, శివారు ప్రాంతాల్లో గురువారం వాతావరణం పొడిగావుంటుందని, అప్పుడప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు రాలే అవకాశముంది.


కోస్తా జిల్లాలకు హెచ్చరిక...

దక్షిణ తమిళనాడు సముద్రతీర జిల్లాల్లో గురువారం తెల్లవారుజామునుంచి 14వతేదీ శనివారం వరకు సముద్రంలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉపరితల ఆవర్తనం కదలికలను బట్టి గాలుల వేగం 65 కిలోమీటర్లకు పెరిగే అవకాశముందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఇందువల్ల స్థానిక పట్టినంబాక్కం, కోవళం, మహాబలిపురం సహా కన్నియాకుమారి వరకు గల సముద్రతీర ప్రాంతాల్లో నివసిస్తున్న జాలర్లు చేపలవేటకు వెళ్ళరాదని హెచ్చరిక జారీ అయ్యింది.


ఈ వార్తలు కూడా చదవండి.

పెరిగిన గోల్డ్, వెండి ధరలు..

హలం పట్టి.. పొలం దున్ని..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 12 , 2025 | 10:33 AM