CBSE Results 2025: సీబీఎస్ఈ 10,12 ఫలితాల్లో బాలికలదే పైచేయి
ABN , Publish Date - May 14 , 2025 | 04:47 AM
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో బాలికలే మెరుగైన ఫలితాలు సాధించగా, విజయవాడ రీజియన్ టాప్లో నిలిచింది. కర్నూలు జిల్లా బాలిక లాస్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.

10వ తరగతిలో 93 శాతం, 12వ తరగతిలో 88.39 శాతం ఉత్తీర్ణత
టాప్లో విజయవాడ రీజియన్..
జవహర్ నవోదయ స్కూళ్లు ఫస్ట్
ఏపీలోని కర్నూలు జిల్లా బాలికకు టెన్త్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు
ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు
న్యూఢిల్లీ, మే 13: సీబీఎస్ ఈ పదో, 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 12వ తరగతి పరీక్షల్లో బాలికలు 91.64 శాతం మంది ఉత్తీర్ణులైతే, బాలురు 85.70 శాతం మంది పాస్ అయ్యారు. మొత్తంగా పదో తరగతిలో 93శాతం మంది విద్యార్థులు, 12వ తరగతిలో 88 శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రీజియన్లో అత్యధికంగా 99.60శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 10వ తరగతిలో కర్నూల్ జిల్లా పత్తికొండ విద్యార్థిని లాస్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించింది. విజయవాడ రీజియన్ తర్వాత తిరువనంతపురం రెండో స్థానంలో నిలిస్తే, ప్రయాగ్గాజ్ రీజియన్ పరిధిలో అతి తక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులు 99.9 శాతం పాసైతే, ప్రైవేటు, ఇండిపెండెంట్ స్కూళ్ల విద్యార్థులు 87.94 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 16,92,794 మంది 12వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వారిలో 1.29 లక్షల పై చిలుకు మంది కంపార్ట్మెంట్ విద్యార్థులున్నారు. విద్యార్థుల్లో అనారోగ్య పోటీ తత్వం పెరుగకుండా ఉండేందుకు ఉత్తీర్ణులైన విద్యార్థులకు డివిజన్లు ఇవ్వడం లేదన్న సీబీఎస్ ఈ పరీక్షల నియంత్రణాధికారి సాన్యం భరద్వాజ.. అత్యధిక మార్కులు సాధించిన టాప్ 0.1 శాతం విద్యార్థులకుమెరిట్ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. ఇక, సీబీఎ్సఈ 10వ, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ.. కేవలం ఒక్క పరీక్ష మాత్రమే వారి శక్తి, సామర్థ్యాలను నిర్వచించలేదని తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. ‘మీ ప్రయాణం చాలా పెద్దది. ఉత్సుకతతో, విశ్వాసంతో ముందుకు సాగండి’ అని పేర్కొన్నారు.