Prajwal Revanna: అత్యాచారం కేసులో మాజీ ఎంపీ రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:29 PM
పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడినట్టు చూపిస్తూ 2,000కు పైగా వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వెలుగు చూడటం సంచలనమైంది. దీనిపై 2024లో ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

బెంగళూరు: సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో జనతాదళ్ సెక్యులర్ (JDS) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా పేర్కొంటూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. మాజీ ఎంపీ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ హసన్ జిల్లా హోలినరసిపుర రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయనపై దాఖలైన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది. జులై 18న ఈ కేసులో విచారణ పూర్తి కాగా.. తీర్పును రిజర్వ్ చేశారు న్యాయమూర్తులు. తాజాగా ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. శిక్షాకాలాన్ని ఆగస్టు 2న ప్రకటించనుంది.
పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడినట్టు చూపిస్తూ 2,000కు పైగా వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వెలుగు చూడటం సంచలనమైంది. దీనిపై 2024లో ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రజ్వల్ కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్లో పని చేసే మహిళ 2024 ఏప్రిల్లో మొదటగా ఆయనపై ఫిర్యాదు చేసింది. 2021 నుంచి పదేపదే తనపై అత్యాచారం చేశారని, బయటకు చెబితే వీడియోలు విడుదల చేస్తామని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేశారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది.
సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతున్నందున తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రజ్వల్ ఇటీవల కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ కోర్టును ఆశ్రయించాలని, కోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చని హైకోర్టు జులై 9న పేర్కొంది. దీంతో రేవణ్ణ తిరిగి విచారణ కోర్టును ఆశ్రయించగా, బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
ఇవి కూడా చదవండి..
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి