Share News

ED: ఈడీ అధికారిని అరెస్టు చేసిన సీబీఐ

ABN , Publish Date - May 31 , 2025 | 05:26 AM

ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ చింతన్‌ రఘువంశీని సీబీఐ అధికారులు లంచం తీసుకుంటుండగా ఒడిశాలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ED: ఈడీ అధికారిని అరెస్టు చేసిన సీబీఐ

  • రూ. 20 లక్షలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి

  • ఒడిశాలో ఘటన.. నిందితుడు ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌

  • 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన న్యాయస్థానం

న్యూఢిల్లీ, మే 30: ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ చింతన్‌ రఘువంశీని సీబీఐ అధికారులు లంచం తీసుకుంటుండగా ఒడిశాలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 2013 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన రఘువంశీ ఓ మైనింగ్‌ కేసును పరిష్కరించేందుకు భువనేశ్వర్‌కు చెందిన వ్యాపారవేత్త నుంచి ఏకంగా రూ. 5 కోట్ల లంచం డిమాండ్‌ చేశారని అధికారులు తెలిపారు. ఒడిశాలోని ఢెంకనాల్‌ కు చెందిన మైనింగ్‌ వ్యాపారి రతికాంత రౌత్‌పై కొన్నాళ్ల క్రితం ఈడీ కేసు నమోదైంది.


విచారణలో భాగంగా ఈ ఏడాది మార్చిలో రౌత్‌ ఈడీ ఆఫీ్‌సకు వెళ్లినప్పుడు కేసుకు సంబంధించి ఆస్తులు అటాచ్‌ చేయకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాలని రఘువంశీ ఆయనపై ఒత్తిడి తెచ్చినట్టు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఇందులో భాగంగా మొదటి విడత రూ. 20 లక్షలు ఇస్తుండగా అరెస్ట్‌ చేసి, సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచామని అధికారులు తెలిపారు. రఘువంశీ తరపు న్యాయవాది సిద్ధాంత్‌ మహంతి మాట్లాడుతూ ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించినట్లు చెప్పారు. అయితే బెయిల్‌ పిటిషన్‌ ఇంకా పెండింగ్‌లో ఉందని, జూన్‌ 4న విచారణకు వస్తుందని మహంతి తెలిపారు.

Updated Date - May 31 , 2025 | 05:30 AM