Share News

Children of Fallen Patriots: త్యాగం కన్న పిల్లలు

ABN , Publish Date - May 13 , 2025 | 05:10 AM

భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల పిల్లల దినోత్సవాన్ని మే 13న జరుపుకుంటారు. యుద్ధాలలో తల్లిదండ్రులను కోల్పోయిన 3,500 మంది పిల్లలు, వారి మానసిక వేదనను గుర్తిస్తూ ఈ రోజు జరుపుకుంటారు.

Children of Fallen Patriots: త్యాగం కన్న పిల్లలు

  • స్వాతంత్య్రం అనంతరం యుద్ధాలు, దాడుల్లో 21 వేలకు పైగా సైనికులు మృతి

  • గత రెండు దశాబ్దాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు 3,500 మందికిపైనే

  • నేడు అమర సైనికుల పిల్లల దినోత్సవం

ఆర్మీ లాన్స్‌ నాయక్‌ దినేశ్‌కుమార్‌ శర్మ.. రెండు రోజుల కింద పాక్‌ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందారు. హరియాణాలోని పల్వాల్‌కు చెందిన ఆయనకు ఏడేళ్ల కావ్య, ఐదేళ్ల దర్శన్‌ ఇద్దరు పిల్లలు. దినేశ్‌ భార్య సీమ ఇప్పుడు ఏడు నెలల గర్భవతి. అంతా అమరవీరుడిగా దినేశ్‌కుమార్‌ను కీర్తిస్తున్నా.. తండ్రి ప్రేమను కోల్పోయిన ఆ పిల్లల పరిస్థితి ఏమిటి, పుట్టబోయే బిడ్డ అయితే కనీసం తండ్రిని చూడలేని స్థితి. ఆర్థికంగా, విద్యాపరంగా ప్రభుత్వ సాయం అందినా.. ఆ పిల్లలు అనుభవించే మానసిక వేదన మాత్రం ఎవరూ తీర్చలేనిది. ఇది ఒక రకంగా ఆ పిల్లలు దేశం కోసం చేసిన త్యాగమే! వారు త్యాగం కన్న పిల్లలే!

యుద్ధమేదైనా పిల్లలపై ప్రభావం..

యుద్ధాలు, పోరాటాల్లో అమర వీరులైనవారి పిల్లల త్యాగాలను, వారికి తగిన సాయం అందాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా మే 13న ‘చిల్డ్రన్‌ ఆఫ్‌ ఫాలెన్‌ పేట్రియాట్స్‌ డే’గా నిర్వహిస్తుంటారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సంతానాన్ని గౌరవించుకునే రోజు ఇది. తాజాగా పాక్‌ దాడుల్లో కన్నుమూసిన వైమానికదళ సార్జెంట్‌ సురేంద్ర కుమార్‌ మోగాకు 11 ఏళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. పహల్గాం దాడి తర్వాత గాలింపు చర్యల్లో ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో కన్నుమూసిన హవల్దార్‌ జంటు అలీ షేక్‌కు పదేళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు.


వేలాది మంది అనాథలుగా..

ఆర్మీ విశ్రాంత సైనికుల వ్యవహారాల డైరెక్టరేట్‌ గణాంకాల ప్రకారం.. మన దేశంలో స్వాతంత్య్రం నాటి నుంచి 21 వేల మంది సైనికులు యుద్ధాల్లో అమరులయ్యారు. గత రెండు దశాబ్దాల్లో మిలటరీ, పారామిలటరీ దళాల్లో పనిచేసే తమ తల్లినిగానీ, తండ్రినిగానీ కోల్పోయిన పిల్లలు 3,500 మందికిపైనే. వీరిలో చాలా మంది తమవారిని కోల్పోయిన బాధను అనుభవిస్తూనే ఉన్నారు. ఇలా ‘‘తల్లినో, తండ్రినో పోగొట్టుకున్న పిల్లలను జీవితాంతం ఆ బాధ వెంటాడుతుంది. కానీ ధైర్యం వారి డీఎన్‌ఏలోనే ఉంటుంది. ఆ వారసత్వాన్ని నిలబెట్టేలా ముందుకు సాగే ప్రయత్నం చేస్తుంటారు కూడా..’’ అని భారత సైన్యంతో కలసి పనిచేసే పిల్లల మానసిక నిపుణురాలు డాక్టర్‌ రీనా మల్హోత్రా చెబుతున్నారు. ఇక ఆర్మీ వెల్ఫేర్‌ ఫండ్‌, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌, భారత్‌ కే వీర్‌, వీర్‌ నారీస్‌ వెల్ఫేర్‌ బోర్డు వంటివి అమరులైన సైనికుల పిల్లల చదువు, ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం బాధ్యతలను చూసుకుంటున్నాయి.

నాన్నను తలచుకుని ఏడవని రోజు లేదు..

  • జోయా ఆలం, శ్రీనగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక. బీఎ్‌సఎ్‌ఫలో పనిచేస్తున్న ఆమె తండ్రి 2018లో ఉగ్రవాదుల బాంబు దాడిలో కన్నుమూశారు. ప్రస్తుతం డెహ్రడూన్‌ మిలటరీ స్కూల్‌లో చదువుతున్న ఆమె.. ‘నేను నాన్న తలచుకుని ఏడవని రోజు లేదు. నా డైరీలో మా నాన్నకు లేఖలు రాస్తా. నేను చెబుతుంటే మా నాన్న వింటున్నట్టు అనిపిస్తుంది’ అని ఆమె చెబుతోంది.

  • తమిళనాడుకు చెందిన కవితారాజ్‌ తండ్రి ఎం.రాజేంద్రన్‌ సైన్యంలో సుబేదార్‌. కార్గిల్‌ యుద్ధంలో కన్నుమూశారు. అప్పుడు ఆమె వయసు పదేళ్లు. ‘యుద్ధం నా తండ్రిని, నా బాల్యాన్ని పోగొట్టింది’ అని ఆమె ఇప్పటికీ ఆవేదన చెందుతూనే ఉంది.

Updated Date - May 13 , 2025 | 10:20 AM