Electoral Roll Revision: బిహార్ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టులో ఆర్జేడీ పిటిషన్
ABN , Publish Date - Jul 06 , 2025 | 09:14 PM
ఆర్జేడీ తరఫున పిటిషన్ సమర్పించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దీనిపై సోమవారంనాడు విచారణ చేపట్టాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఆర్జేడీ తరఫున ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా ఈ పిటిషన్ వేశారు.

న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల జాబితా రివిజన్ (Electoral Roll Revision)కు ఎన్నికల కమిషన్ (EC) ఇచ్చిన ఆదేశాలపై విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. తాజాగా ఓటర్ల జాబితా సవరణపై ఈసీ ఇచ్చిన ఆదేశాలను ఆ రాష్ట్రంలోని ప్రధాన విపక్ష పార్టీ అయిన ఆర్జేడీ (RJD) సవాలు చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్జేడీ తరఫున పిటిషన్ సమర్పించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దీనిపై సోమవారంనాడు విచారణ చేపట్టాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఆర్జేడీ తరఫున ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా ఈ పిటిషన్ వేశారు.
బిహార్లో అనర్హత కలిగిన ఓటర్లను తొలగించి, అర్హులైన వారిని జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక విస్తృత సమీక్ష జరపాలని జూన్ 24న ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. శ్రీఘ్రగతిని అర్బనైజేషన్ చోటుచేసుకోవడం, తరచు జరుగుతున్న వలసలు, కొత్తగా అర్హులైన యువ ఓటర్లు, మరణాల వివరాలు రిపోర్ట్ చేయకపోవడం, అక్రమ విదేశీ వలసదారుల పేర్లు చేర్చడం వంటి కారణాలను ఈసీ ప్రస్తావించింది. ఎన్నికల జాబితా సమగ్రత, కచ్చితత్వం కోసం ఈ సమీక్ష అవసరమని తెలిపింది. ఓటర్ వెరిఫికేషన్ కోసం బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారని తెలిపింది. అయితే, ఈసీ ఆదేశాలపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఎస్ఐఆర్ కోసం ఈసీఐ ఇచ్చిన ఆదేశాలను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) స్వచ్ఛంద సంస్థ శనివారంనాడు సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇందువల్ల లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని తెలిపింది.తన పౌరసత్వం గురించి మాత్రమే కాకుండా తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని కూడా పత్రాల ద్వారా నిరూపించాల్సి ఉంటుందని, లేకపోతే ఓటరు పేరును జాబితా నుంచి తొలగిస్తారని తెలిపింది. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, వలస కార్మికులు మూడు కోట్ల మంది ఓటు హక్కు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సైతం బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సమీక్షను తప్పుపడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈసీఐ బిహార్లో చేపబట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సమీక్ష అమలును తక్షణం ఆపివేయాలని, ఇతర రాష్ట్రాల్లోనూ ఈసీఐ ఇలాంటి ఆదేశాలు ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఆదేశించాలని మహువా మొయిత్రా తన పిటిషిన్లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే, ఈ వాదనలను బీజేపీ సారథ్యంలో ఎన్డీయే తోసిపుచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే విపక్షాలు సాకులు వెతుక్కుంటున్నాయని ఆక్షేపించింది.
ఇవి కూడా చదవండి..
బిహార్లో ఓటర్ల జాబితా వివాదంతో ఈసీ కీలక నిర్ణయం
ఈసీఐ ఓటర్ల జాబితా సమీక్షపై సుప్రీంకోర్టుకు మహువా మొయిత్రా
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి