Benagaluru Stampede: తొక్కిసలాట కేసులో మరో మలుపు.. కర్ణాటక హైకోర్టుకు ఆర్సీబీ
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:00 PM
బెంగళూరు తొక్కిసలాటకు దారితీసిన క్రౌడ్ మేనేజ్మెంట్లో తమ పాత్ర ఏమీ లేదని కర్ణాటక హైకోర్టుకు ఆర్సీఎస్ఎల్ తెలిపింది. విక్టరీ సెలబ్రేషన్స్కు పరిమితంగానే పాస్లు ఉన్నాయని, ఉచిత రిజిస్ట్రేషన్ పాసుల కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తాము చాలా స్పష్టమైన ప్రకటనలు చేసినట్టు పేర్కొంది.

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం వెలుపల జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనపై ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓనర్ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్(RCSL), ఈవెంట్ ఆర్గనైజర్ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్లు కర్ణాటక హైకోర్టు (Karnataka High Court)ను సోమవారం నాడు ఆశ్రయించాయి. తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరాయి.
గేట్లు తెరవడంలో ఆలస్యం..
తొక్కిసలాటకు దారితీసిన క్రౌడ్ మేనేజ్మెంట్లో తమ పాత్ర ఏమీ లేదని ఆర్సీఎస్ఎల్ తమ పిటిషన్లో పేర్కొంది. విక్టరీ సెలబ్రేషన్స్కు పరిమితంగానే పాస్లు ఉన్నాయని, ఉచిత రిజిస్ట్రేషన్ పాసుల కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తాము చాలా స్పష్టమైన ప్రకటనలు చేసినట్టు తెలిపింది. స్టేడియం గేట్లు తెరవడంలో ఆలస్యం జరిగిందనీ ఆరోపించింది. షెడ్యూల్ ప్రకారం 1:45 గంటలకు గేట్లు తెరవాల్సి ఉండగా.. 3.00 గంటలకు తెరిచారని, దీంతో ఒక్కసారిగా జనం అక్కడకు చేరుకున్నారని తెలిపింది.
పోలీసుల వైఫల్యమే..
డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ మరో పిటిషన్లో పోలీసులు, రాష్ట్ర అధికారుల వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని ఆరోపించింది. 3లక్షల మందికి పైగా ప్రజలు వచ్చినప్పుడు వారిని కంట్రోల్ చేయడంలో పోలీసులు, రాష్ట్ర అధికారులు విఫలమయ్యారని పేర్కొంది. తగినన్ని పోలీసు బలగాలను మోహరించకపోవడం, లాఠీచార్జ్ జరపడంతో ఈవెంట్కు హాజరయ్యేందుకు వచ్చిన వారు ఆందోళనకు గురయ్యారని, దీంతో స్టేడియం వెలుపల రోడ్లు, ఫుట్పాత్లపై తొక్కిసలాట జరిగిందని వివరించింది. ఎక్కువ మంది పోలీసులను విధానసభ వద్దే మోహరించి, స్టేడియం వద్ద తగినంత సిబ్బంది లేకుండా చేసినట్టు కూడా ఆరోపించింది.
క్రమశిక్షణా చర్య నుంచి తప్పించుకునేందుకు కుబ్బన్ పార్క్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుమోటో ఫిర్యాదు చేసినట్టు డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ఆరోపించింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా హడావిడిగా పక్షపాత వైఖరితో తమపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు తెలిపింది. జూన్ 6వ తేదీ ఉదయం ఎలాంటి విచారణ లేకుండానే కంపెనీకి చెందిన ఇద్దరు అధికారులను అరెస్టు చేసినట్టు పేర్కొంది. నేరుగా తమ తప్పిదం ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాలూ లేనందున తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని ఆర్సీఎస్ఎల్, డీఎన్ఏలు తమ పిటిషన్లలో హైకోర్టును కోరాయి.
ఇవి కూడా చదవండి..
కంటైనర్ షిప్లో పేలుడు.. రంగంలోకి నేవీ
ఘోర ప్రమాదం.. రైలు నుంచి పడి ఐదుగురు మృతి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి