Venkaiah Naidu: మతం పేరుతో పాకిస్థాన్ విష బీజాలు నాటుతోంది
ABN , Publish Date - May 25 , 2025 | 09:38 PM
Venkaiah Naidu:పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని భారత గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. మతం పేరు అడిగి మరీ 26 మంది అమాయకులను కాల్చి చంపటం అత్యంత దారుణమని వెంకయ్య నాయుడు అన్నారు.

లండన్: ఉగ్రవాదం (Terrorism) మానవాళికి పెద్ద శత్రువు అని, ఇది ప్రపంచ సమస్య అని, ఉగ్రవాదాన్ని శాశ్వతంగా తుద ముట్టించడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని భారత గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు. ఇవాళ (ఆదివారం) లండన్లో వీహెచ్పీ హిందూ సెంటర్లో బ్రిటిష్- భారత తెలుగు సంస్కృతి సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు పాల్గొని ప్రసంగించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ మేరకు వెంకయ్య నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.
శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం..
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని తెలిపారు. మతం పేరు అడిగి మరీ 26 మంది అమాయకులను కాల్చి చంపటం అత్యంత దారుణమని అన్నారు. భారత అంతర్గత విషయాల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటూ శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని, ఆ దేశం ప్రోత్సాహంతోనే పహల్గామ్లో ఉగ్రవాదులు దుస్సాహసానికి ఒడిగట్టారని చెప్పారు. దీనికి ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకున్నారని, పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశం ఆపరేషన్ సిందూర్ పేరుతో అత్యంత కచ్చితత్వంతో పాకిస్థాన్లోని ముఖ్యమైన తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిందని చెప్పారు. ఇదే ఆఖరు కాదని... సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదులకు సాయం ఆపకపోతే ఇది కొనసాగుతుందని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
అత్యంత పాశవికమైన చర్య
‘మతం పేరుతో ఉగ్రవాదానికి పాల్పడటం అత్యంత పాశవికమైన చర్య. నాగరిక సమాజం చేసే పని ఇది కాదు. ఇది అనాగరిక చర్య. పాకిస్థాన్ సైన్యాధిపతి మతం పేరుతో విషబీజాలు నాటడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడి సైన్యం, అక్కడి పాలకులు ఎంత అనాగరికంగా ఆలోచిస్తున్నారో పహల్గామ్ ఉగ్ర దాడే నిదర్శనం. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు. ఇది 145 కోట్ల మంది భారతీయుల సంకల్పం, ఐక్యతకు నిదర్శనం. దేశం యావత్తు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు తిరంగా యాత్రలు నిర్వహించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినదించారు. సైన్యం వెంటే మేము అని చాటి చెప్పారు. ఇది నవభారతం. ఉగ్రవాద భరతం పట్టే భారతం. నాలుగు ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయోత్పత్తితో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం ఎంతో సంతోషకరం. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత జపాన్ను అధిగమించి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం భారత భవిష్యత్తుకు శుభ సూచకం. ఇదే సంకల్పశక్తితో భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదన్న పరిపూర్ణ విశ్వాసం నాకు ఉంది. దేశంలోని ప్రతి కుటుంబం సుస్థిర అభివృద్ధిలో భాగం కావాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి ఫలాలు అందుకోవాలనే లక్ష్యంతో భారతదేశ ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ లక్ష్యసాధనకు ఉగ్రవాదం తీవ్ర అవరోధం. అందుకే భారత్ ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు. భారత్ మాత్రమే బాధిత దేశం కాదని, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలన్నీ ఉగ్రవాద బాధిత దేశాలే’ అని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు.
ఉగ్రవాదంతో కుటుంబాలు చిన్నాభిన్నం
‘ఉగ్రవాదంతో ప్రపంచవ్యాప్తంగా లక్షల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. సమాజంలో ప్రశాంతత కరువవుతోంది. సమాజంలో సుస్థిరత లోపించి అభివృద్ధి కుంటుపడుతోంది. 2030 నాటికి ప్రపంచంలో పేదరికాన్ని రూపు మాపడానికి, సమస్త విశ్వ శ్రేయస్సు కోసం, సురక్షితమైన ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడానికి ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను రూపొందించి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ లక్ష్యాల సాధనకు ఉగ్రవాదం తీవ్ర ఆటంకంగా మారింది. ప్రపంచంలో ప్రతి మూలా శాంతియుతంగా ఉంటేనే సుస్థిర అభివృద్ధి, మానవాళి శ్రేయస్సు సాధ్యం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలి. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికే పెనుముప్పు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి కార్యాచరణతో ఉగ్రవాదాన్ని శాశ్వతంగా తుద ముట్టించాలి. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనే లక్ష్యసాధనకు భారత్ చొరవ తీసుకుంటోంది. పార్టీలకు అతీతంగా భారత పార్లమెంటు సభ్యులతో కూడిన బృందాలు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నాయి. ఉగ్రవాదంపై భారత వైఖరిని తెలపడంతో పాటు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని ఈ బృందాలు వివరిస్తున్నాయి. మునుపెన్నడూ ఏ దేశమూ తీసుకోని చొరవ ఇది. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ఉగ్రవాదం ఎంతటి పెనుముప్పో అర్థం చేసుకొని ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇది’ అని వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు.
సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి
‘ఆత్మీయులైన తెలుగువారందరినీ బ్రిటన్లో కలుసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉంది. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు సుబ్బారావు సూచించినట్లు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు, భారతీయులు ఎక్కడున్నా అక్కడి నియమ నిబంధనలను, చట్టాలను పాటిస్తూ గౌరవిస్తూ, ఆ దేశాల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూనే మన సంస్కృతి సంప్రదాయాలను కూడా పరిరక్షించుకోవాలి. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మరిచిపోకూడదు. తెలుగు ప్రపంచంలో ఏ భాషకూ, ఏ సంస్కృతికీ తీసిపోదు. పైగా మన భాషలో ఉన్నంత లౌకిక, అలౌకిక విజ్ఞానం మరెక్కడా లేదు. భాష అంటే కొన్ని అక్షరాల సమూహం కాదు. అది ఒక తరం నుంచి మరో తరానికి అందుతున్న జ్ఞాన, విజ్ఞాన పరంపర. అందుకే మన మాతృభాషను మనం మరవకూడదు, విస్మరించకూడదు. మేథస్సు, తెలివి తేటలు తెలుగువారి రక్తంలో ఉన్నాయి. అవి ఒక తరంతో వచ్చేవి కావు. ఈ ప్రకృతితో మనం ఎలా మమేకం కావాలి. దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. సమాజం నడత ఎలా ఉండాలనే తరతరాలుగా చేసిన మేథోమదనం వల్లే మేథస్సు రూపుదిద్దుకుంటుంది. తెలుగువారి తెలివితేటలు ఈ విధంగా అభివృద్ధి చెందినవే. అందుకే మన తెలుగు వారు ప్రపంచ మేటి కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు. అలాంటి తెలుగుభాషను మాట్లాడకుండా మరేదో కారణంతో పరాయి భాషను మాట్లాడుతుంటే మన పదాలను మరచిపోతాం. మన భావవ్యక్తీకరణను మరిచిపోతాం. అంటే మన విజ్ఞానాన్ని మరచిపోతాం. మన విజ్ఞానాన్ని ఎప్పుడైతే మరచిపోతామో అప్పుడు మనం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. మీకేమీ తెలియదు- అంతా మేమే నేర్పించాం అనిపించుకోవాల్సి వస్తుంది. బానిసలుగా మారాల్సి వస్తుంది. బ్రిటన్లో ఉన్న తెలుగువారంతా తెలుగు భాషా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటున్నారని తెలిసి సంతోషంగా ఉంది’ అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిటిష్- భారత తెలుగు సంస్కృతి సంఘం వ్యవస్థాపక చైర్మన్ శ్రీ సురేశ్, తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం
పండుగలా సీఎం చంద్రబాబు గృహప్రవేశం
For More AP News and Telugu News