Pakistan Dangerous: పాకిస్థాన్ మోస్ట్ డేంజరస్ అంటున్న రష్యా.. ఇంగ్లాండ్
ABN , Publish Date - Apr 30 , 2025 | 08:40 PM
ఇంతకాలం పాకిస్థాన్ అకృత్యాలు, నీచత్వాల గురించి గొంతు చించుకుని ప్రపంచ వేదికలమీద అరుస్తూ వచ్చింది భారత్. అయితే, ఇప్పుడు యావత్ ప్రపంచానికి పాక్ పాపాల చిట్టా అర్థమవుతోంది.

Pak 'One Of World's Most Dangerous: ఇంతకాలం పాకిస్థాన్ అకృత్యాలు, నీచత్వాల గురించి గొంతు చించుకుని ప్రపంచ వేదికలమీద అరుస్తూ వచ్చింది భారత్. అయితే, ఇప్పుడు యావత్ ప్రపంచానికి పాక్ పాపాల చిట్టా అర్థమవుతోంది. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ కంట్రీ పాకిస్థాన్ అంటూ మాస్కో, లండన్ అధికార వర్గాలు ఒక అంచనాకు వచ్చేశాయి. ఫిబ్రవరి 2019లో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన దాడికి కారణమైన లష్కర్, జైష్ వంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ నిధులు, శిక్షణా శిబిరాలు సమకూర్చిందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
పాకిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద స్థావరాలలో ఒకటిని లండన్, మాస్కో(రష్యా) ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తోందని చూపించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కూడా ఆయా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ముంబైలో జరిగిన 26/11 దాడులు సహా అంతకు ముందు జరిగిన అనేక ఉగ్ర దాడులకు పాకిస్థాన్ సపోర్ట్ ఉన్నట్టు చెబుతున్నారు. అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను 2011లో యూఎస్ ఆపరేషన్ ఫోర్స్ పాకిస్తాన్లోని అబోటాబాద్లోని ఒక ప్రాంగణంలో కనుగొన్న విషయాన్ని ఉదహరిస్తున్నారు.
పాక్ మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్, జనరల్ పర్వేజ్ ముషారఫ్ సహా సీనియర్ పాక్ రాజకీయ నాయకులు చేసిన, చేస్తున్న ప్రకటనలను కూడా రష్యా, ఇంగ్లాండ్ ప్రభుత్వ వర్గాలు తప్పుబట్టాయి. ఉగ్రవాద నిధుల గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు, తమ దేశం అమెరికా కోసం "డర్టీ పనులు" చేసిందని పాకిస్తాన్ మంత్రి చెప్పిన విషయాన్ని కూడా సదరు ప్రభుత్వ వర్గాలు చూపిస్తున్నాయి. 2008, 2011లో కాబూల్లోని భారత, అమెరికన్ రాయబార కార్యాలయాలపై దాడులు, 2024లో మాస్కోలోని ఒక సాంస్కృతిక కేంద్రంపై దాడులు, 2005లో లండన్ అంతటా బాంబు దాడులు వంటి దుర్మార్గపు పనులకు పాల్పడిన ఉగ్రమూకలకు పాకిస్తాన్ ప్రభుత్వ అండ ఉందని చెబుతున్నారు.