Imran Khan: భారత్ దుస్సాహసం చేస్తే తిప్పికొడతాం.. ఇమ్రాన్ హెచ్చరిక
ABN , Publish Date - Apr 30 , 2025 | 06:09 PM
శాంతికే తాము (పాక్) ప్రాధాన్యత ఇస్తామని, అంత మాత్రం చేత దానిని పిరికితనంగా అపోహపడ వద్దని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారతదేశం ఎలాటి దుస్సాహసానికి పాల్పడినా దానిని తిప్పికొట్టే సామర్థ్యం పాకిస్థాన్కు ఉందన్నారు.

ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తొలిసారి స్పందించారు. పహల్గాం ఘటన తీవ్రంగా కలపరిచే, విషాదకరమైన ఘటన అని అభివర్ణించారు. అయితే దీనిపై భారతదేశం బాధ్యతాయుతంగా స్పందించాలని హెచ్చరించారు.
''హహల్గాం ఘటనలో పౌరులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తు్న్నాను'' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఇమ్రాన్ పేర్కొన్నారు.
అణ్వాయుధ ప్రస్తావన
ఇమ్రాన్ తన పోస్ట్లో అణ్వాయుధాల ప్రస్తావన చేశారు. ''ఫాల్స్ ఫ్లాగ్ పుల్వామా ఆపరేషన్ జరిగినప్పుడు ఇండియాకు పూర్తి సహకారం అందిస్తామని మేము ముందుకు వచ్చాం. పటిష్టమైన సాక్ష్యాలను చూపించడంలో భారత్ విఫలమైంది. 2019లో నేను ఊహించినట్టుగానే మళ్లీ ఇప్పుడు పహల్గాం దాడి చోటుచేసుకుంది. ఆత్మపరిశీలన చేసుకోవడం, విచారణ చేపట్టానికి బదులు మోదీ సర్కార్ తిరిగి పాకిస్థాన్పై నిందారోపణలకు దిగుతోంది. అణు ఉద్రికతకు దారితీసే పరిస్థితికి బదులుగా 150 కోట్ల జనాభా ఉన్న దేశంగా ఇండియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి'' అని పలు కేసుల్లో పాక్ జైలులో ఉన్న పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ అన్నారు.
శాంతికే ప్రాధాన్యం, పిరితనం కాదు..
శాంతికే తాము (పాక్) ప్రాధాన్యత ఇస్తామని, అంత మాత్రం చేత దానిని పిరికితనంగా అపోహపడ వద్దని ఇమ్రాన్ అన్నారు. భారతదేశం ఎలాటి దుస్సాహసానికి పాల్పడినా దానిని తిప్పికొట్టే సామర్థ్యం పాకిస్థాన్కు ఉందని, 2019లో తమ ప్రభుత్వానికి బాసటగా నిలిచినట్టే యావత్ దేశం ప్రభుత్వానికి దన్నుగా నిలుస్తుందని చెప్పారు.
కశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం
కశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికార హక్కు ఉందని తాను మొదట్నించీ చెబుతున్నానని, ఐక్యరాజ్యసమితి తీర్మానం ఇందుకు హామీ ఇచ్చిందని ఆయన అన్నారు. చట్టవిరుద్ధంగా 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత కశ్మీర్లో అణచివేత చర్యలకు భారత్ పాల్పడుతోందని, దీంతో విముక్తి కోరుతున్న కశ్మీర్ ప్రజల ఆకాంక్ష మరింత పెరిగిందని అన్నారు. ''యుద్ధానికి తహతహలాడుతూ, ప్రాంతీయ శాంతికి ముప్పుగా పరిణమించే మోదీ ప్రమాదకర ఆలోచనలను తిప్పికొట్టేందుకు పాకిస్థాన్ ఏకతాటిపై నిలుస్తుంది. బయట శత్రువుపై యుద్ధంలో గెలవానునుకుంటే మందు అంతర్గతంగా దేశం ఐక్యంగా ఉండాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూాడా చదవండి..