Share News

Israeli airstrikes: దారుణం.. తొమ్మిది మంది అన్నాచెల్లెళ్లు మృతి..

ABN , Publish Date - May 26 , 2025 | 08:32 AM

ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడుల్లో విషాదం చోటు చేసుకుంది. ఖాన్ యూనిస్‌పై దాడి చేసింది. ఈ ప్రాంతం డేంజర్ వార్ జోన్‌ అని స్పష్టం చేసింది.

Israeli airstrikes: దారుణం.. తొమ్మిది మంది అన్నాచెల్లెళ్లు మృతి..

గాజా, మే 26: ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణల కారణంగా.. గాజాలో సామాన్యుల పరిస్థితి గాలిలో దీపంగా మారింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇప్పటికే వేలాది మంది చిన్నారులు మరణించారు. కాగా, తాజాగా మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చిన్నారులు మరణించారు. శనివారం గాజాలోని ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది పిల్లల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వాళ్ల తండ్రి వైద్యుడు హమ్ది అల్ నజ్జర్ తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటన స్థానికులను కన్నీటి పర్యంతం చేస్తోంది.

అయితే ఈ దాడిలో ప్రాణాలతో బయటపడిన వైద్యుడు హమ్ది అల్ నజ్జర్‌‌తోపాటు ఆయన కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో నజ్జర్‌ను దక్షిణ గాజాలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నజ్జర్ ఆరోగ్యంపై ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యుడు అజీజ్ అల్ ఫార్రా స్పందించారు. నజ్జర్‌కు పొత్తి కడుపుతోపాటు ఛాతి భాగంలో రక్త స్రావం జరిగిందన్నారు. దాంతో ఆయనకు ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. అలాగే అతని తలకు సైతం గాయాలయ్యాయని వెల్లడించారు. ఆ భగవంతుడే అతడిని రక్షిస్తాడని ఈ సందర్భంగా వైద్యులు ఫార్రా ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇక గాయాలపాలైన అతడి కుమారుడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నా.. ప్రస్తుతానికి స్థిరంగా ఉందని గాజాలోని వైద్య ఉన్నతాధికారులు తెలిపారు. ఈ దాడిలో మృతి చెందిన చిన్నారుల వయస్సు ఒకటి నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటుందని వివరించారు.


ఈ దాడి జరిగిన సమయంలో నజ్జర్ భార్య అలా.. అక్కడ లేరని చెప్పారు. గత 20 మాసాలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడి జరుగుతోందని గుర్తు చేశారు. ఈ దాడుల్లో గాయపడిన వారికి అలా చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలోనే నజ్జర్‌తోపాటు వారి కుమారుడికి సైతం వైద్య చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు.. వైమానిక దాడి జరిగిన అనంతరం ఆమె ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె భర్తతోపాటు చిన్నారులు రక్తపు మడుగులో పడి ఉన్నారని నజ్జర్ సమీప బంధువులు తెలిపారు.


మరోవైపు ఖాన్ యూనిస్ ప్రాంతంపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ మిలటరీ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ సైనికులకు దగ్గరగా ఉన్న నిర్మాణంలోని అనుమానితులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అయితే ఈ ప్రాంతంలో ప్రజలను దాడులకు ముందే ఖాళీ చేయించినట్లు వివరించింది. అదీకాక ఖాన్ యూనిస్ ప్రాంతం డేంజరస్ వార్ జోన్‌గా ఇజ్రాయెల్ ఇప్పటికే ఓ ప్రకటనలో వెల్లడించింది.


20 నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో 2 మిలియన్ల పాలస్తీనా వాసులను ఆ ప్రాంతం నుంచి తరలించిన సంగతి తెలిసిందే. 2023 అక్టోబర్‌లో హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 1,200 మంది మరణించారు. వీరిలో అధిక శాతం మంది పౌరులే ఉన్నారు. మరో 251 మందిని అపహరించారు. ఇక హమాస్‌ను నిర్మూలించడం, బందీలను విడుదల చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చెబుతున్న ప్రతీకార దాడుల్లో 53,000 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. వీరిలో పౌరులే అధికంగా ఉన్నారని తెలిపారు. వీరిలో 18 ఏళ్లలోపు 16,500 మందికి పైగా పిల్లలు ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

కాకాణిని నెల్లూరుకు తీసుకువచ్చిన పోలీసులు

భూమిక మృతదేహం అప్పగింతకు నిరాకరణ

For International news And Telugu News

Updated Date - May 26 , 2025 | 09:08 AM