Elon Musk: ఎలాన్ మస్క్ యూ-టర్న్.. ట్రంప్కు భయపడి..!
ABN , Publish Date - Jun 06 , 2025 | 10:31 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద సంచలన ఆరోపణలు చేసిన ఎలాన్ మస్క్ హఠాత్తుగా యూ-టర్న్ తీసుకున్నారు. డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ నడుమ విభేదాలు తీవ్రతరమయ్యాయి. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో వీళ్లకు ఒకరంటే మరొకరికి పడటం లేదు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. ట్రంప్ మీద మస్క్ సంచలన ఆరోపణలు చేయడం, ఆయన అవసరం లేకుండానే తాను ఎన్నికల్లో గెలిచేవాడ్ని అని యూఎస్ ప్రెసిడెంట్ అనడం.. ఇలా వీళ్ల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఈ తరుణంలో మస్క్ యూ-టర్న్ తీసుకున్నారు. డ్రాగన్ అంతరిక్ష నౌకను తాము ఉపసంహరించుకోబోవడం లేదని స్పష్టం చేశారు. తాను టీమ్ అమెరికాతోనే ఉన్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు.
మాటలు వాపస్..
రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును వ్యతిరేకించడంతో మస్క్పై సీరియస్ అయిన ట్రంప్.. ఆయన లేకుండానే పెన్సిల్వేనియాలో తాను నెగ్గేవాడ్ని అని తెలిపారు. మస్క్ బిజినెస్కు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్ట్లు, రాయితీలకు తప్పకుండా కోత విధిస్తానని ఆయన హెచ్చరించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మస్క్.. డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ను వెంటనే ఉపసంహరించుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై కొన్ని గంటల్లోనే ఆయన మాట మార్చారు. డ్రాగన్ నౌక ఉపసంహరణ విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు ఎక్స్లో స్పష్టం చేశారు. తాను టీమ్ అమెరికాకు మద్దతుగా ఉంటానని తెలిపారు. కాగా, ట్రంప్తో విభేదాల నేపథ్యంలో గురువారం పలు ఆసక్తికర ట్వీట్లు చేశారు మస్క్. అధ్యక్షుడు విధిస్తున్న టారిఫ్ల వల్ల ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆర్థిక మాంద్యం రాబోతోందని హెచ్చరించారు. తాను లేకపోతే 2024 ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యేవారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మస్క్ యూ-టర్న్ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ట్రంప్కు భయపడే ఆయన వెనక్కి తగ్గారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చదవండి:
అక్రమ వలసదార్లపై అమెరికా ఉక్కుపాదం
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి