Anantapur: మామిడి మాటున విషం.. ఈ పండ్లను తింటే..
ABN , Publish Date - May 20 , 2025 | 12:41 PM
మామిడిపండ్లంటే ఇష్టపడని వారుండరు. అయితే.. ఈ పండ్లను కార్బైడ్తో మాగబెడుతూ విషతుల్యం చేస్తున్నారు. తద్వారా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మామిడి తోటల దగ్గర తక్కువ ధరకు తెస్తున్న వ్యాపారులు వాటిని గోదాముల్లో కార్బైడ్తో మాగబెడుతున్నారు. వీటిని తినడం ద్వారా పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

- కార్బైడ్తో మాగబెడుతున్న వ్యాపారులు
- పట్టించుకోని ఆహార భద్రతాధికారులు
పుట్టపర్తి(అనంతపురం): ఫలరాజుగా ప్రసిద్ధిగాంచిన మామిడిపండ్లను ఇష్టపడని వారుండరు. ప్రస్తుతం మామిడిపండ్ల సీజన్ కావడంతో ఎక్కడ చూసినా విక్రయిస్తున్నారు. మంచి రంగును చూసి మైమరిచి ఎంతధరైనా కొనితీసుకెళ్తున్నారు. ఇంటికెళ్లి కోసి తినేటప్పుడు కాని దాని అసలు రంగు బయటపడటంలేదు. మంచి రంగుతో ఉన్న మామిడిపండ్లు రుచిపచీ లేకుండా చప్పగా ఉంటున్నాయి. సహజసిద్ధమైన రుచి, వాసన లేక మామిడి మధురాన్ని వినియోగదారులు అనుభవించలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం రసాయనాలతో మాగబెట్టడమే. జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు కార్బైడ్తో మాగపెట్టిన మామిడిపండ్లను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులు మామూళ్లకు మరిగి మండీల వైపు చూడటంలేదనే విమర్శలు ఉన్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
సహజంగా ఎలా మాగబెడతారంటే..
చెట్ల నుంచి మామిడికాయలు కోశాక ఎండుగడ్డి మధ్యలో ఉంచి గదిలోని గాలి బయటకు పోకుండా వేడిపెంచడం ద్వారా మాగబెడతారు. వారం పదిరోజుల్లో పూర్తిగా మాగి మంచి వాసన, రంగుతో నిగనిగలాడుతాయి. ఈ పద్ధతిలో ఎక్కువ సమయం పడుతుండటంతో ఏదోరకంగా మాగబెట్టి త్వరగా అమ్మిసొమ్ము చేసుకోవాలనే దోరణిలో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు.
వ్యాపారులు ఎలా చేస్తున్నారంటే..
పక్వానికి రాకుండానే మామిడికాయలను కోసేసి వ్యాపారులు కార్బైడ్ పెట్టి మాగబెడుతున్నారు. దీంతో రెండు మూడురోజుల్లోనే కాయలకు నిగనిగలాడే రంగు వస్తోంది. పైకి బాగా కనపడుతున్నా లోపల ఉన్న కండంతా దెబ్బతింటోంది. కార్బైడ్తో మాగబెట్టిన మామిడిపండ్లను తింటే కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు, ఊపిరితిత్తుల సమస్యలే కాక క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఎర్ర రక్తకణాలు దెబ్బతిని రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
నిబంధనలు గాలికి..
ఆహారభద్రతా నిబంధనల మేరకు ఇథలీన్ పౌడర్తో మామిడికాయలను మాగబెట్టవచ్చు. పౌడర్ ఉండే కవర్కు రంధ్రం చేసి మామిడిపండ్ల మధ్యలో ఉంచడం ద్వారా గాలి బయటకు పోకుండా చూస్తే రెండుమూడురోజుల్లో కాయలు మాగే అవకాశం ఉంది. కార్బైడ్ వాడకంపై నిషేధం ఉంది. కార్బైడ్తో మామిడిపండ్లను మాగబెట్టి అమ్మడం నేరం. ఇలాంటి దుశ్చర్యలను అరికట్టాల్సిన ఆహారభద్రతా అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడడం లేదు.
చర్యలు తీసుకుంటాం
కార్బైడ్తో మామిడికాయలను మాగబెడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. మండీలను తనిఖీచేసి చర్యలు తీసుకుంటాం. బాధ్యులపై కేసులు నమోదుచేస్తాం. ఎవరైనా ఇలాంటి పద్దతిలో మామిడికాయలను మాగబెట్టి విక్రయిస్తుంటే మాకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మా ఫోన్ నంబరు 9703383684కు ఫోన్చేసి వివరాలు తెలపవచ్చు. సదరు మామిడిపండ్లను శాంపిల్ తీసి నిబంధనలకు విరుద్ధంగా మాగబెడుతుంటే కేసులు నమోదు చేస్తాం.
-రామచంద్ర, జిల్లా ఆహార భద్రతాధికారి
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Rice Production: సస్యశ్యామల భారతం
Siricilla : పాత బకాయిలు లేనట్లేనా..?
Telangana fire services: ఇక.. మహిళా ఫైర్ఫైటర్లు
Read Latest Telangana News and National News