Mahanadu: జగన్ను భయపెట్టిన మహానాడు..
ABN , Publish Date - Jun 03 , 2025 | 10:46 AM
మాజీసీఎం జగన్ అడ్డా కడప గడ్డ ఇప్పుడు టిడిపికి అడ్డాగా మారిందా.. కడప గడ్డపై టిడిపి మహానాడు జనసంద్రాన్ని చూసిన జగన్ రెడ్డి జడుసుకున్నాడా.. వైయస్ కుటుంబ రాజకీయ కోట కడప గడ్డ ఇక టిడిపి కోటగా మారుతుందేమో అని జగన్ రెడ్డి భయందోళనకు గురవుతున్నాడా.. కడప వైసీపీ నేతల మధ్య జరుగుతున్న హాట్ టాపిక్ పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

కపడ, జూన్ 3: కడప గడ్డ జగన్ అడ్డా కాదు ఇది టిడిపికి అడ్డా.. అని టిడిపి అధినేత చంద్రబాబు నుండి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరి నోట ఇప్పుడు ఇదే మాట. కడప గడ్డ టీడీపీకి అడ్డా అని ఎన్నికల్లోనే తేలిందని ఇప్పుడు కడపలో జరిగిన టిడిపి మహానాడు కడప టిడిపి అడ్డా అని మరొక్కసారి తేల్చేసిందని టిడిపి నేతలు అంటున్నారు. అనడమేకాదు.. కడపలో మహానాడు సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో తెలుగు తమ్ముళ్లు పట్టలేని ఆనందంతో ఉన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 స్థానాల్లో 9 కాంగ్రెస్ ఖాతాలో ఒకే ఒక్కటి టిడిపి దక్కించుకుంది. ఆ తరువాత జగన్ రెడ్డి వైసీపి పార్టీ పెట్టిన తర్వాత మొత్తం 10 కి 10 స్థానాలు వైసిపి ఖాతాలో పడ్డాయి. దీంతో అప్పట్లో వైయస్ కుటుంబం అభిమాన నేతలు, వైసిపి నాయకులు ఇక కడప జిల్లాలో టిడిపి అనేది ఉండదని ఎప్పటికీ కడప జిల్లా వైయస్ కుటుంబం రాజకీయ అడ్డా అని పదేపదే అనేవారు. అయితే జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో వైసిపి నేతల రాచకాలు, అక్రమాలు దౌర్జన్యాలు జగన్ రెడ్డి సొంత కడప జిల్లా ప్రజలను కూడా మార్చేశాయి. వారు స్వయంగా చేసుకున్న పాపాలు వారికే తగిలాయి. కడప గడ్డ ఎప్పటికీ వైయస్ కుటుంబానికి రాజకీయ కోట అని రెచ్చిపోయిన వైసీపీ నేతలకు ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లా ప్రజలు సరైన బుద్ధి చెప్పారనేది వాస్తవం. ఉమ్మడి కడప జిల్లా 10 స్థానాల్లో 7 స్థానాలు కూటమికి దక్కగా జగన్ రెడ్డి పులివెందులతో కలిపి 3 స్థానాలు మాత్రం దక్కించుకోగలిగారు. కడప గడ్డ వైఎస్ కుటుంబానికి కంచుకోట.. కడపజిల్లా అంటే వైఎస్ కుటుంబం రాజకీయ కోట అని, ఇక టిడిపి అనేది ఇక్కడ వినిపించదు కనిపించదని డబ్బా కొట్టుకున్న వైసిపి నేతలు ఎన్నికల తర్వాత కడప జిల్లాలో కూటమి విజయంతో ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
కడపలో జరిగిన టిడిపి మహానాడు చరిత్ర సృష్టించిందనేది నగ్నసత్యం. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన మహానాడులతో పోల్చుకుంటే అన్ని విధాల కడప మహానాడు భిన్నంగా జరిగిందని, సూపర్ డూపర్ సక్సెస్ అయిందని టిడిపి నేతలే కాకుండా అందరి నోట ఇదేమాట. వైఎస్ కుటుంబం ముఖ్యంగా జగన్ రెడ్డి కడప గడ్డ మా అడ్డా అని ఏళ్ల తరబడి రెచ్చిపోతున్నారని, ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలే ఇది వైఎస్ కుటుంబానికి అడ్డా కాదు టిడిపి అడ్డా అని నిరూపించారు. ఇప్పుడు అదే కడపలో మహానాడు నిర్వహించి మరోసారి తమ సత్తా చూపాలని ముఖ్యంగా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిసింది. అనుకున్నట్లుగానే చంద్రబాబు, లోకేష్ లు కడపలో మహానాడు నిర్వహించి సూపర్ డూపర్ సక్సెస్ అయ్యేలా చేసుకుని తమసత్తా చాటి కడప గడ్డ జగనన్న కాదు.. టిడిపికి అడ్డా అని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఈ మహానాడు విజయం జగన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తుందట. ఏళ్ల తరబడి రాజకీయంగా మన అడ్డా అనుకుంటే.. టిడిపి ఇక్కడ మహానాడు నిర్వహించి ఇంత పెద్ద స్థాయిలో సూపర్ హిట్ కావడం ఏంటని ఆపార్టీ అధినేత జగన్ రెడ్డి, వైసిపి నేతలు ఆలోచనలో పడ్డారట.. ఎన్నికల్లో చూస్తే మన కడప జిల్లాలో కూటమి మెజార్టీ సీట్లు సాధించడం, ఇప్పుడు చూస్తే మహానాడు ఇంత పెద్ద విజయవంతం కావడం మన జగన్కు ఇవి కోలుకోలేని దెబ్బలే అని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారట.
అలాగే మహానాడు సందర్భంగా కడప జిల్లా అంతట పసుపుమయం కాగా.. జగన్ సొంత అడ్డా పులివెందుల్లో ఓర్వలేని వైసీపీ శ్రేణులు బరితెగించి సర్కిళ్లలో టిడిపి శ్రేణులు ఏర్పాటు చేసిన మహానాడు తోరణాలు అన్నింటిని పీకిపడేశారు. ఈ ఘటన ఇరు పార్టీల మధ్య వివాదంగా మారింది. పులివెందుల ఘటనకు బాధ్యులైన 15 మంది వైసీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏది ఏమైనా కడపలో జరిగిన టిడిపి మహానాడు జగన్ రెడ్డిని, ఆ పార్టీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేసిందని వైసిపి నేతలే చర్చించుకుంటున్నారట.
Also Read:
షాక్లో ఎన్నారై.. పదేళ్ల తరువాత ఇండియాకు వస్తే..
For More Andhra Pradesh News and Telugu News..