Botsa Satyanarayana : ఆ రోజుకు 3 రాజధానులు
ABN , Publish Date - Mar 04 , 2025 | 03:53 AM
‘మూడు రాజధానులపై నేటి మా వైఖరి ఏమిటో పార్టీలో చర్చించి చెపుతాం’ అని శాసన మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు.

ఇప్పుడేంటో పార్టీలో చర్చించి చెప్తాం: బొత్స
అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ‘మూడు రాజధానులపై నేటి మా వైఖరి ఏమిటో పార్టీలో చర్చించి చెపుతాం’ అని శాసన మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... ‘ఆ రోజుకు మూడు రాజధానులు మా విధానం. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ సమస్య ముందుకు వస్తే మళ్లీ చర్చించుకొని చెపుతాం. అమరావతి నిర్మాణంపై అధికార పక్షం కప్పగంతులేస్తోంది. బడ్జెట్పై చర్చను డైవర్ట్ చేయడానికి అధికార పార్టీ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. సచివాలయ భవనాలపై మంత్రులు స్పష్టత ఇవ్వలేదు. తాత్కాలిక భవనాలని ఎప్పుడూ చెప్పలేదని అంటున్నారు. అలాంటప్పుడు కొత్త నిర్మాణాలకు టెండర్లు పిలవడం ఎందుకు? రుషికొండ భవన నిర్మాణాలపై మేం విచారణ కోరుతుంటే ప్రభుత్వం ఎందుకు జంకుతోంది? రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం రూ.6,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మిగతా ఖర్చుకు ప్రభుత్వానికి స్తోమత లేకే వైసీపీ అమరావతిని నిర్మించలేదని చెప్పారు. రాజధానికి నిధులివ్వద్దని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయాల్సిన అవసరం మాకు లేదు. పోసాని కృష్ణ మురళి ఏదో మాట్లాడినట్లు పత్రికల్లో వస్తే నేను స్పందించాల్పిన అవసరం లేదు. ఆయన వ్యాఖ్యలకు వీడియో లేదా పోలీసుల నిర్ధారణ ఉంటే స్పందిస్తాం’ అని బొత్స అన్నారు.