Share News

Yogandra 2025: యోగాంధ్రను విజయవంతం చేయండి.. రఘురామ పిలుపు

ABN , Publish Date - Jun 14 , 2025 | 10:46 AM

Yogandra 2025: ఈనెల 21న వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా సీఎం ప్రణాళిక చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ తెలిపారు. రెండు కోట్ల మంది యోగాకు రిజిస్టర్ అవుతారు అనుకుంటే, రెండు కోట్ల 20 లక్షల మంది రిజిస్టర్ అయ్యారన్నారు.

Yogandra 2025: యోగాంధ్రను విజయవంతం చేయండి.. రఘురామ పిలుపు
Yogandra 2025

పశ్చిమగోదావరి, జూన్ 14: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ( International Yoga Day) పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో మాసోత్సవాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం (AP Govt). ఇందులో భాగంగా ప్రతీ జిల్లాలో ప్రజలు రోజూ యోగాసనాలు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్రలో రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు కూడా పాల్గొని యోగాసనాలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈరోజు (శనివారం) పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (Deputy Speaker Raghurama Krishna Raju) పాల్గొన్నారు.


జిల్లాలోని కాళ్ల మండలం పెదఆమిరంలో యోగాంధ్ర 2025 కార్యక్రమం నిర్వహించారు. యోగా కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే యోగాంధ్ర కార్యక్రమం ఏపీ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పెద్ద ఎత్తున నెలరోజుల పాటు యోగా శిక్షణ నిర్వహిస్తున్నారన్నారు. ఈనెల 21న వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా ప్రణాళిక చేస్తున్నారని తెలిపారు. రెండు కోట్ల మంది యోగాకు రిజిస్టర్ అవుతారు అనుకుంటే, రెండు కోట్ల 20 లక్షల మంది రిజిస్టర్ అయ్యారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 8,50,000 మంది యోగా రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. భారతదేశంలోనే యోగా అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేలాగా యోగాంధ్ర 2025ని విజయవంతం చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. ఈ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని యోగాసనాలు వేశారు.


ఇక ఈనెల జూన్ 21న విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ యోగా డే‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. విశాఖలో జరిగే యోగా దినోత్సవ వివరాలను ఇప్పటికే కేంద్ర ఆయూష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ వెల్లడించారు. 45 నిమిషాల పాటు యోగా కార్యక్రమం ఉంటుందని.. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. యోగా కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగే యోగా కార్యక్రమాలు లైవ్ ప్రసారం జరుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

5 రోజుల పాటు భారీ వర్షాలు!

లక్ష దాటిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 10:58 AM