Share News

TDP Mahanadu 2025: పసుపు పండుగ సూపర్‌ హిట్‌

ABN , Publish Date - May 30 , 2025 | 03:28 AM

కడపలో జరిగిన టీడీపీ మహానాడు సూపర్ హిట్‌గా ముగియగా, లోకేష్ మార్కు ముఖ్యాంశాలు, చంద్రబాబు అధ్యక్షత్వంలో పార్టీలో సమయపాలన పై పెద్దపీట వేసారు. లక్షలాది కార్యకర్తలు, అభిమానులు బహిరంగ సభకు హాజరై విజయ సంబరాలు జరుపుకున్నారు.

TDP Mahanadu 2025: పసుపు పండుగ సూపర్‌ హిట్‌

  • జనసంద్రమైన కడప గడప

  • మూడ్రోజుల వేడుకలో ఆద్యంతం లోకేశ్‌ మార్క్‌

  • ‘కార్యకర్తే అధినేత’ సహా 6 శాసనాలకు ఆమోదం

  • చంద్రబాబు నుంచి నేతల వరకు చర్చ దానిపైనే

  • పార్టీ నియమావళిని సవరించి చేర్చిన వైనం

  • మొత్తం 14 అంశాలపై తీర్మానాలు

  • సమయ పాలనకు పెద్దపీట

  • బాబు నుంచి లోకేశ్‌ వరకు నేతలంతా నిర్దేశిత టైంలోనే ప్రసంగాల ముగింపు

  • 12వ సారి అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నిక

  • చివరి రోజు బహిరంగ సభకు లక్షల్లో తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు

  • (మహానాడు ప్రాంగణం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి)

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప గడ్డపై మహానాడు విజయ సంరంభం ముగిసింది. కడప జిల్లా సీకే దిన్నె మండలం పబ్బాపురంలో మంగళవారం ప్రారంభమైన మహానాడు.. గురువారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభతో సమాప్తమైంది. లక్షలాదిగా తరలివచ్చిన జనాన్ని చూసి టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తొలిసారి కడపలో జరిగిన ఈ మహానాడులో ఆద్యంతం యువ నేత లోకేశ్‌ మార్కు స్పష్టంగా కనబడింది. తొలి రోజు ఆయన ఆలోచనలకు అనుగుణంగా కార్యకర్తలకు పెద్దపీట వేశారు. వారికి భరోసా ఇచ్చేందుకు.. పార్టీ పటిష్ఠానికి.. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆయన ‘నా తెలుగు కుటుంబం’ పేరుతో ఆరు శాసనాలను ప్రతిపాదించారు. వాటిలో ‘కార్యకర్తే అధినేత’ అనే ప్రతిపాదన సీఎం చంద్రబాబుతోపాటు సామాన్య కార్యకర్తనూ బాగా ఆకట్టుకుంది. చంద్రబాబు తన ప్రసంగాల్లో పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావించారు. పార్టీ నియమావళిని సవరించి మరీ ఈ ఆరు శాసనాలను చేర్చారు. గతానికి భిన్నంగా.. ఈసారి మహానాడు వేదికపై మాట్లాడే అవకాశాన్ని కార్యకర్తలకు కల్పించారు. మొదటి రెండ్రోజుల్లో అతిరథ మహారథుల సమక్షంలో తమకు మాట్లాడే అవకాశం కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి అధిష్ఠానం పెద్దపీట వేస్తుందన్న సంకేతాలను బలంగా పంపేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడింది.


తరలివచ్చిన తమ్ముళ్లు

కడప మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచీ టీడీపీ కార్యకర్తలు, నాయకులు వేల సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 23 వేల మంది పార్టీ ప్రతినిధులకు అధికారికంగా ఆహ్వానాలు పంపారు. అదనంగా వేల మంది వరకు కార్యకర్తలు హాజరయ్యారు. సుమారు 125 ఎకరాల్లో ప్రాంగణాన్ని నిర్మించి ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూశారు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు.

కడప జనసంద్రం

మహానాడు బహిరంగ సభకు తరలివచ్చిన టీడీపీ అభిమానులు, ప్రజలు, కార్యకర్తలతో గురువారం కడప నగరం జనసంద్రంగా మారింది. చిత్తూరు, కర్నూలు, తిరుపతి, రాజంపేట వైపుల నుంచి వచ్చిన వేల వాహనాలు చీమల బారులను తలపించాయి. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ మొదలవుతుందని ప్రకటించారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి జనం తెల్లారేసరికే వేదిక వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నానికి బహిరంగ సభ ప్రాంగణంతో పాటు పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. 5 లక్షల మందితో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించిన ఆ స్థాయిలో జనసమీకరణ చేసింది. సభకు దాదాపు 4 లక్షల మంది హాజరు కాగా.. అక్కడకు చేరుకోలేక వెనుతిరిగిన వారు మరో 2 లక్షల మంది ఉంటారని పార్టీ నాయకుల అంచనా.

23 తీర్మానాలు.

మహానాడు తొలి రోజు ఐదు అంశాలపై తీర్మానాలు చేశారు. ఇవన్నీ లోకేశ్‌ ప్రతిపాదిత 6 శాసనాల్లో భాగం కావడం గమనార్హం. మరుసటి రోజు 9 తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. తెలంగాణకు సంబంధించి ఐదు తీర్మానాలను ఆమోదించారు. రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడిగా 4 తీర్మానాలు చేశారు.


చెప్పిన సమయానికే..

గతంలో జరిగిన మహానాడులకు, పార్టీ సభలకు భిన్నంగా ఈసారి సమయ పాలనపై నిర్వాహకులు దృష్టి సారించారు. లోకేశ్‌ ఈ విషయంలో కచ్చితంగా ఉండడంతో మహానాడు తొలి రోజు మంగళవారం సమయపాలన పక్కాగా పాటించారు. ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదు మొదలు.. వేదికపై చంద్రబాబు, లోకేశ్‌ ప్రసంగాల వరకు నిర్దేశిత సమయానికే ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు తొలి రోజు కార్యక్రమాన్ని ముగించాల్సి ఉండగా 20 నిమిషాలు ఆలస్యం కావడంతో వేదికపైనే చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. బుధవారం రెండో రోజు కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా సమావేశాన్ని ముగించారు. చివరి రోజు బహిరంగ సభను నిర్వాహకులు అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సభను నిర్దేశిత సమయం ప్రకారం సాయంత్రం 5.10 నిమిషాలకు ముగించారు.

డ్రోన్లతో పర్యవేక్షణ

బహిరంగసభకు భారీ ఎత్తున జనం పోటెత్తడం, పెద్దసంఖ్యలో వాహనాలు రావడంతో అత్యాధునిక డ్రోన్లతో ఐజీపీ సీహెచ్‌ శ్రీకాంత్‌ డ్రోన్లతో పర్యవేక్షించారు. 23 డ్రోన్లు, నాలుగు అత్యాధునిక టెక్నాలజీ డ్రోన్లను వినియోగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూశారు. మహానాడుకు ముందురోజు కడపలో భారీ వర్షం కురిసింది. అయితే తర్వాతి మూడు రోజులు కురవలేదు. గురువారం సభ ముగిశాక మాత్రం చినుకులు పడ్డాయి.


సుస్థిర పాలనపై చంద్రబాబు స్పష్టత

మహానాడు వేదికగా చంద్రబాబు సుస్థిర పాలన ఆవశ్యకతపై స్పష్టత ఇచ్చారు. గుజరాత్‌ అభివృద్ధికి సుస్థిర పాలన ఏ విధంగా దోహదపడింది.. ఏపీలో 2019లో టీడీపీ ఓటమి వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరిగిందన్న విషయాలను ప్రజలందరికీ అర్థమయ్యేలా వివరించారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులనుంచి అద్భుత స్పందన లభించింది. ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్‌ ప్రసంగాలకు భారీ స్పందన వచ్చింది. సభ ముగిసిన అనంతరం కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి చంద్రబాబుకు నాగలి, చెర్నాకోల బహూకరించారు. ఆయన చెర్నాకోలను తిప్పడంతో తెలుగు తమ్ముళ్లు నృత్యం చేశారు. కాగా.. మహానాడు ముగిసిన తర్వాత చంద్రబాబు కడప విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో సుమారు 4 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా నిలబడిన కార్యకర్తలకు ఆయనకు వీడ్కోలు పలికారు. శ్రేణుల కోలాహలంతో ఆయన కాన్వాయ్‌ రెండుసార్లు ఆగింది.

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం

‘ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. సూపర్‌ సిక్స్‌ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారంటూ జగన్‌ అండ్‌ కో తప్పుడు ప్రచారం చేస్తోంది. చెప్పిన సూపర్‌ సిక్స్‌నే కాదు చెప్పని అనేక పథకాలనూ అమలు చేస్తున్నాం. జగన్‌కు తన పరిస్థితి అర్థమవుతోంది. వైసీపీ పని అయిపోయిందన్న భావనతో ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షనిజంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంతో అభివృద్ధి చెందుతోంది.’

- సవిత, కడప జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి

విజన్‌ ఉన్న నేత చంద్రబాబు

‘భవిష్యత్తు గురించి ఆలోచించే విజన్‌ ఉన్న నేత చంద్రబాబు. కడప ఎవరబ్బ సొత్తు కాదు. టీడీపీ నాయకత్వాన్ని, కార్యకర్తలను అనేక ఇబ్బందులకు జగన్‌ ప్రభుత్వం గురిచేసే సమయంలో ఆ సైకో పాలనను ఎదిరించేందుకు లోకేశ్‌ ముందుకు వచ్చారు. కార్యకర్తలకు భరోసా ఇస్తూ వారి అండతో ముందుకు కదిలారు. దీంతో తమ పార్టీ పని అయిపోతుందన్న ఆవేదనతో వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఏకంగా చంద్రబాబును జైల్లో పెట్టారు. రాయలసీమలో కియా, శ్రీసిటీ, హీరో కంపెనీ లాంటి పరిశ్రమలతో అనేక మందికి జీవనాధారం అందుబాటులోకి వచ్చింది.’

- అనిత, మంత్రి


వైఎస్‌ కుటుంబాన్ని నమ్ముకుని నష్టపోయాం

‘ఎన్నో తరాలుగా వైఎస్‌ కుటుంబంతో కలసి ఉన్నా. అయినా ఎటువంటి అభివృద్ధి సాధించింది లేదు. ఆ తరువాత టీడీపీలో చేరడం వల్ల అభివృద్ధిని సాధించుకున్నాం. జిల్లాలో గత ఎన్నికల్లో ఏడు స్థానాలు గెలుచుకున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలను ఆ పాలకులు హింసించారు. జిల్లాలోని పెండింగు ప్రాజెక్టులకు చంద్రబాబు ఒక రూపు తీసుకు వచ్చారు.’

- రాంప్రసాద్‌రెడ్డి, మంత్రి

కడప ఇక జగన్‌ అడ్డా కాదు

‘కొన్ని పేపర్లు, టీవీల్లో జగన్‌ ఇలాఖాలో మహానాడు జరుగుతుందని ప్రచారం చేస్తున్నాయి. జగన్‌ హవా 2024కు ముందు ఉండేదేమో. ఇక్కడ పది అసెంబ్లీ స్థానాల్లో ఏడింటిని టీడీపీ గెలుచుకుంది. ఇంక ఎక్కడ ఇది జగన్‌ అడ్డా! రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా వైసీపీ తీసుకురాలేదు. ఐదేళ్ల పాటు రాష్ట్రానికి సీఎంగా ఉన్న జగన్‌ తాను ప్రాతినిధ్యం వహించే పులివెందులకు కనీసం తాగు నీటిని కూడా అందించలేదు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం చంద్రబాబు ఇప్పటికే జిందాల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.3,200 కోట్ల వ్యయంతో కొప్పర్తి వద్ద అనేక పరిశ్రమలను తీసుకువచ్చి కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. లిక్కర్‌, వివేకా కేసుల్లో వైసీపీ అగ్ర నేతలు జైలుకెళ్లక తప్పదు.’

- బీటెక్‌ రవి, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్‌

రాయలసీమ అంటే ఒకప్పుడు ఫ్యాక్షనిజమే

‘1983 కంటే ముందు రాయలసీమ అంటే ఫ్యాక్షనిజమే. ఇదే అందరి మనసులో ఉండేది. ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించి రాయలసీమ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. చంద్రబాబు కుప్పం కంటే పులివెందులకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. మొట్టమొదటగా పులివెందులకు నీరిచ్చి ఘనత సాధించారు. ఎటువంటి అభివృద్ధి చేయని జగన్‌ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయనతో జైలు జీవితం అనుభవించిన విజయసాయిరెడ్డి కూడా నమ్మడం లేదు. ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. ఈ వేదికపై నుంచి ఒక్కటే కోరుతున్నా... చక్రాయపేటలో కాలేటి వాగును పూర్తి చేయండి.’

- రాంగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ


జన సునామీ చూసి వైసీపీ నేతల గుండెలు గుభేల్‌

‘రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులను చూసి వైసీపీ నేతల గుండెలు గుభేల్‌మంటున్నాయి. గత పాలనలో టీడీపీ కార్యకర్తల నుంచి చంద్రబాబు వరకూ ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు గమనించాం. ప్రతి ఒక్కరూ జగన్‌ పరిపాలనలో ఇబ్బందిపడ్డారు. చంద్రబాబు పరిపాలనలో ప్రజలకు ఉత్తమ సేవలందించిన అధికారులు అవార్డులు అందుకుంటుంటే జగన్‌ పరిపాలనలోని అధికారులు జైళ్లకు వెళుతున్నారు.’

- ఎంఎస్‌ రాజు, ఎమ్మెల్యే

చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి

‘ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి సాధించింది. కడపలో మహానాడు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. మా జిల్లాలో మహానాడు నిర్వహించాలని ఎమ్మెల్యేలం, నాయకులం కోరిన వెంటనే అందుకు అంగీకరించి ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసిన చంద్రబాబుకు కృతజ్ఞతలు. మరోసారి జగన్‌ లాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వవద్దు. ’

- నంద్యాల వరదరాజులరెడ్డి, ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు

భేష్‌.. రెడ్డీం

శ్రీనివాసరెడ్డి భావోద్వేగం..

మహానాడు సక్సెస్‌ కావడంతో చంద్రబాబు టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త ఆర్‌.శ్రీనివాసరెడ్డిని మనస్ఫూర్తిగా అభినందించారు. దీంతో ఆయన భావోద్వేగానికి లోనై అధినేతను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. సీఎం ఆయన భుజం తట్టి ఊరడించారు. ఏర్పా ట్లు బాగా చేశారని, జనసమీకరణ బాగా జరిగిందని, బాగా సక్సెస్‌ చేశారని కొనియాడారు. జిల్లా నేతలను కూడా ఆయన, లోకేశ్‌ ప్రశంసించారు.

Updated Date - May 30 , 2025 | 03:37 AM