Minister Ramanarayana Reddy: కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం తప్పేది..
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:05 PM
కాశీబుగ్గ మృతుల కుటుంబాల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు.
శ్రీకాకుళం: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. తొక్కిసలాటలో 8 మంది మహిళలతో పాటు ఒక యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించినట్లు చెప్పారు. ఇది అకారణంగా జరిగిన ఘటన అని చెప్పుకొచ్చారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం తప్పేదని పేర్కొన్నారు. ఆలయ నిర్మాత పాండే ఓ మంచి ఉద్దేశ్యంతో ఆలయం నిర్మించారని గుర్తు చేశారు. కానీ ఆలయ నిర్మాణంలో సాంకేతిక సలహాలు తీసుకోలేదని వివరించారు.
కాశీబుగ్గ మృతుల కుటుంబాల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. 7 అడుగుల ఎత్తునుంచి పక్కనున్న రెయిలింగ్పై ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఘటనపై వెంటనే మంత్రులును, అధికారులను అలర్ట్ చేశారని పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కలెక్టర్ ఇప్పటికే విచారణ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. త్వరలో ఘటనకు సంబంధించి నివేదికను వెల్లడిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి
Indias Heaviest Communication Satellite: ఇస్రో భారీ ప్రయోగం