Rajya Sabha Election May 9: రాజ్యసభ స్థానానికి 9న ఉప ఎన్నిక
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:16 AM
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి వచ్చే నెల 9న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలో టీడీపీ పోటీ చేయకుండా, బీజేపీకి సీటు వదిలివేయాలని నిర్ణయించింది

విజయసాయి రాజీనామాతో ఖాళీ అయినసీటుకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
ఈ నెల 22న నోటిఫికేషన్
29 వరకు నామినేషన్లు
పోటీలో టీడీపీ లేనట్లే.. బీజేపీకి కేటాయింపు!
అభ్యర్థి ఎవరో ఒకట్రెండు రోజుల్లో స్పష్టత
అమరావతి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి వచ్చేనెల 9న పోలింగ్ జరుగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మే 2 తుది గడువు. అవసరమైతే మే 9న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. మే 13తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. కాగా.. ఈ ఉప ఎన్నికలో పోటీచేయరాదని టీడీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.మిత్రధర్మంలో భాగంగా బీజేపీకి ఈ సీటు వదిలేయాలని భావిస్తోంది. రాజ్యసభలో సొంతగా బలం పెంచుకునేందుకు బీజేపీ ఈ స్థానాన్ని కోరినట్లు తెలిసింది. ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.