Share News

Weather Alert: ముందుగానే రుతు రాగం

ABN , Publish Date - May 11 , 2025 | 05:15 AM

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 27న కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో వచ్చే నెల రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది.

Weather Alert: ముందుగానే రుతు రాగం

  • 27న కేరళను తాకనున్న నైరుతి

  • 4 రోజుల ముందే రుతుపవనాల రాక

  • 13న దక్షిణ అండమాన్‌ సముద్రానికి

  • ఆగమనానికి అనుకూల వాతావరణం

  • వచ్చే నెల రెండో వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

  • త్వరలో ఎండల నుంచి ఉపశమనం

  • భారత వాతావరణ శాఖ ప్రకటన

అమరావతి/విశాఖపట్నం, మే 10(ఆంధ్రజ్యోతి): రైతన్నలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయి. ఈ నెల 27న కేరళకు వస్తాయని ఐఎండీ ప్రకటించింది. 13వ తేదీన దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. గత 20 ఏళ్లలో 2015లో మినహా 2005-2024 మధ్య కేరళకు నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండీ అంచనాలు తప్పలేదు. తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు, వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనున్నది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 నుంచి వారం రోజుల వ్యవధిలో కేరళను తాకనున్నాయి. ఆ తర్వాత వారం, పది రోజుల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు విస్తరిస్తాయి. రుతుపవనాలు కేరళను తాకినప్పటి నుంచి ఏపీలో వాతావరణం మారుతుంది. జూన్‌ మూడో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఈ ఏడాది నాలుగు రోజులు ముందే రుతుపవనాలు రానున్నందున వచ్చే నెల రెండో వారం నుంచే వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


అనుకూల వాతావరణం

పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా దశ ముగిసి ప్రస్తుతం తటస్థ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పసిఫిక్‌లో ఉపరితల ఉష్ణోగ్రతలు అనుకూలంగా మారడంతో నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించేందుకు అనువైన వాతావరణం నెలకొంది. వాయవ్య భారత్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు, దక్షిణాదిన రుతుపవనాల ముందస్తు వర్షాలు ఎక్కువగా నమోదు కావడం, ఉష్ణమండల వాయవ్య పసిఫిక్‌ మహాసముద్రంలో సగటు ఉపరితల పీడనం, దక్షిణ చైనా సముద్రం నుంచి బయటకు వెళ్లే దీర్ఘకాల రేడియేషన్‌, హిందూ మహాసముద్రంలో ఈశాన్య ప్రాంతం, ఇండోనేషియా పరిసరాల్లో ఉపరితలం నుంచి వచ్చే గాలులు అనుకూలంగా మారడంతో రుతుపవనాలు నాలుగు రోజులు ముందుగానే కేరళను తాకనున్నట్టు ఐఎండీ తెలిపింది. మే 20వ తేదీ తరువాత దక్షిణ అండమాన్‌ సముద్రానికి రుతుపవనాలు తాకాల్సి ఉండగా, ఈసారి వారం ముందుగా అంటే.. 13వ తేదీన ప్రవేశించనున్నాయి. తరువాత నాలుగైదు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్‌ ప్రాంతం, దక్షిణ, మధ్య బంగాళాఖాతం, అండమాన్‌లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ (104 శాతం) వర్షపాతం నమోదవుతుందని గత నెలలోనే వాతావరణ శాఖ ప్రకటించింది.


నేడు, రేపు వడగాడ్పుల ప్రభావం

రాష్ట్రంలో ఆదివారం 41-43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి జిల్లాలో 11 మండలాలు, అనకాపల్లి జిల్లాలో 8 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, అల్లూరి, అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 30 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. మరోవైపు అక్కడక్కడా పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం 24 మండలాల్లో తీవ్రంగా, 57 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం తిరుపతి జిల్లా రేణిగుంలో 41.7 డిగ్రీలు, విజయనగరంలో 41.1, తూర్పుగోదావరి జిల్లా మురమండలో 41, అన్నమయ్య జిల్లా కంభాలకుంటలో 40, కడప జిల్లా మద్దూరు, ప్రకాశం జిల్లా మేకలవారిపల్లిలో 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 11 , 2025 | 05:15 AM