Minister Nara Lokesh : అక్కడ ఒప్పందాలుండవు.. చర్చలే!
ABN , Publish Date - Jan 28 , 2025 | 05:45 AM
. ‘చంద్రబాబు 1997 నుంచి దావోస్ వెళ్తున్నారు. అక్కడ ఎప్పుడూ ఒప్పందాలు జరగవు. చర్చిస్తారు.. కంపెనీల ఆసక్తి మేరకు ఆ తర్వాత ఒప్పందాలు చేసుకుంటారు.

ఏకంగా వర్కులోకే వెళ్తామని మిట్టల్ చెప్పారు
ఆర్సెలార్కు అనుమతులన్నీ ఇచ్చేశాం
3 నెలల్లో విశాఖకు టీసీఎస్: లోకేశ్
టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, వీటి వల్ల 4.1 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ అన్నారు. ‘చంద్రబాబు 1997 నుంచి దావోస్ వెళ్తున్నారు. అక్కడ ఎప్పుడూ ఒప్పందాలు జరగవు. చర్చిస్తారు.. కంపెనీల ఆసక్తి మేరకు ఆ తర్వాత ఒప్పందాలు చేసుకుంటారు. ఒప్పందం ఎందుకు.. ఏకంగా వర్కులోకి వెళ్తామని ఆర్సెలార్ మిట్టల్ చెప్పారు. దీనిని తప్పుబడతారా? ఇప్పటికే ఆర్సెలార్ ఉక్కుకు అన్ని అనుమతులూ ఇచ్చేశాం. త్వరలో భూమి కేటాయిస్తాం. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి.. పారిశ్రామికవేత్తలకు విశ్వాసం పెరుగుతుంది. గతంలో దావోస్లో జగన్ను కలిసేందుకు ఒక కంపెనీ ప్రయత్నిస్తే అందుకు నిరాకరించారు. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఐటీ కంపెనీల ప్రతినిధులను కలిశాను. టాటా చైర్మన్ చంద్రశేఖర్ను కలిసిన తర్వాత విశాఖకు టీసీఎస్ వస్తోంది. 3 నెలల్లో రాబోతోంది. ఆ కంపెనీకి కావలసిన మౌలిక వసతులు కల్పించాం. రానున్న రెండేళ్లలో భూములు సమకూర్చుకుని టీసీఎస్ సొంతంగా క్యాంపస్ ఏర్పాటుచేస్తుంది. ఇన్ఫోసిస్ కూడా సొంత క్యాంపస్ కోసం చూసుకుంటోంది. ఐదేళ్లలో ఐటీలో విశాఖలో ఐదు లక్షల మందికి ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఐటీలో డీప్ టెక్నాలజీ, బిగ్డేటా, ఏఐ వచ్చాయి. వాటిని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాం. డేటా సిటీ గురించి చర్చిస్తున్నాం. టాప్ 100 కంపెనీలతో మాట్లాడాం. జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) ఏర్పాటుకు కృషిచేస్తున్నాం. ఫార్చూన్ 2000లో ఉన్న కంపెనీలకు దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా తక్కువ ధరకు భూములిస్తామని దావోస్లో హామీ ఇచ్చాను. పెట్టుబడిదారులంతా మళ్లీ జగన్ అధికారంలోకి రారని గ్యారెంటీ ఇవ్వగలరా అని అడుగుతున్నారు. మాజీ మంత్రి రోజాకు దావోస్,జ్యూరిచ్కు తేడా తెలియదు’ అని అన్నారు.
కొందరు సీఈవోల వల్ల విశాఖ ఉక్కుకు నష్టం
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగదనే మాటకు కట్టుబడి ఉన్నామని లోకేశ్ చెప్పారు. ‘అనేక ఉక్కు కర్మాగారాలు ప్రైవేటీకరణ దిశగా పయనిస్తున్నాయి. ఒక సెంటిమెంటుతో ఏర్పడిన విశాఖ ఉక్కు నిలబడేందుకు కేంద్రం ప్యాకేజీ ఇచ్చింది. సొంత గనులు లేకపోవడం వల్ల కాదు.. కొందరు సీఈవోల వల్ల కర్మాగారం నష్టపోయింది.’అని తెలిపారు. పాయకరావుపేట-తుని పరిసరాల్లో విమానాశ్రయం కోసం కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడితో మాట్లాడాల్సి ఉందన్నారు. విద్యాదీవెన విషయంలో విద్యార్థులను ఇబ్బందులు పెట్టే కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్కు పవన్ అభినందనలు
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News