Deputy CM Pawan Kalyan: ఏనుగుల సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 01:32 PM
కుప్పం నియోజకవర్గంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగుల దాడిలో మరణించాడు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ స్పందిస్తూ.. కిట్టయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ఏనుగుల సంచారంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, నవంబర్ 13: ఏనుగుల సంచారంపై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాలలోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేయాలన్నారు. ఈ ప్రక్రియను మరింత పెంచాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించిన ఘటనపై పవన్ స్పందించారు. ఈ ఘటనపై పీసీసీఎఫ్, సంబంధిత అధికారులతో ఈరోజు (గురువారం) ఉదయం డిప్యూటీ సీఎం చర్చించారు. కిట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని సత్వరమే అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
తమిళనాడు అటవీ ప్రాంతం వైపు నుంచి వచ్చిన ఏనుగు మూలంగా ఈ ఘటన చోటు చేసుకుందని, అక్కడ కూడా సదరు ఏనుగు మూలంగా మరణాలు సంభవించాయని పవన్కు అటవీ శాఖ అధికారులు వివరించారు. మన రాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వస్తోందని ట్రాక్ చేసిన వెంటనే సమీప గ్రామాల వారికి ముందుగానే తెలియచేశామని చెప్పారు.
దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ముందస్తు హెచ్చరికలను మరింత విస్తృతం చేయాలన్నారు. గ్రామాలవారీగానూ, రైతులతోనూ సోషల్ మీడియా గ్రూప్స్ ఏర్పాటు చేసి వాటికి టెక్స్ట్ మెసేజ్లతో పాటు, వాయిస్ మెసేజ్లు కూడా పంపిస్తే సమాచారం తొందరగా చేరుతుందని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి...
విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సదస్సు.. హాజరుకానున్న నారాయణ
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి డోలా
Read Latest AP News And Telugu News