Minister Lokesh: మహిళలను కించపరిస్తే సహించం.. లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:25 PM
Minister Lokesh: అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్లో పడుతుందని మంత్రి లోకేష్ అన్నారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే అంటూ మరోసారి స్పష్టం చేశారు.

అమరావతి, జూన్ 7: అమరావతి దేవతల రాజధాని కాదు అది వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) తీవ్రంగా తప్పుబట్టారు. అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి మీడియాలో వచ్చిన వార్తలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి స్పందించారు. రాజధాని మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమంటూ హెచ్చరించారు. మహిళలను ఇంత ఘోరంగా అవమానిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే అంటూ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
లోకేష్ ట్వీట్
మహిళలను అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు. మహిళలను ఇంత ఘోరంగా మీడియా సాక్షిలో అవమానిస్తారా జగన్ అంటూ ప్రశ్నించారు. అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం దిగజారుడుతనానికి పరాకాష్ట అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుందన్నారు. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్లో పడుతుందని తెలిపారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే అంటూ మరోసారి స్పష్టం చేశారు. భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి అని అన్నారు. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి రాజధాని అని చెప్పుకొచ్చారు.
జగన్ అనే సైతాన్ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి అని అన్నారు. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుంది అంటూ ఫైర్ అయ్యారు. మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నారన్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నామని తెలిపారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నామన్నారు.
అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగ్ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించమన్నారు. మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతాం.. ఆడపిల్లలా ఏడొద్దు, తామేమి గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర మహిళలను అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తామన్నారు. ‘దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్ పనిపడుతుంది’ అంటూ మంత్రి ట్వీట్ చేశారు.
అలాంటి వాళ్లకు తావులేదన్న మంత్రి
ఇక తిరుపతిలో ఓ వ్యాపారిని వైసీపీ నేత అనుచరులు బెదిరించిన దృశ్యాలను మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్టు చేస్తూ.. కూటమి ప్రభుత్వంలో గూండాలు, రౌడీలకు చోటు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల అరాచక పాలనను భరించలేక ప్రజలు కూకటి వేళ్ళతో పెకలించారని... అయితే ఏడాది గడిచినా వైసీపీ పిల్ల సైకోలు పాత వాసనలు వీడకుండా అక్కడక్కడా దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి అన్నారు. తిరుపతిలో మోహనరావు అనే కారు స్పేర్ పార్టుల వ్యాపారి నుంచి వాటాల కోసం వైసీపీ నేత భూమన అభినయ్ అనుచరులు చైతన్య, సాయి, యశ్వంత్ విచక్షణారహితంగా దాడికి దిగారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో రౌడీలు, గూండాలు, సైకోలకు తావులేదన్నారు. అటువంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, నిందితులకు శిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరుతున్నట్లు మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. వారిని కోరుతున్నాను.
ఇవి కూడా చదవండి..
ఏపీకి గూగుల్.. స్థలం పరిశీలన పూర్తి
భారతీ.. మీ ఆయన్ను అదుపులో పెట్టుకో.. అమరావతి మహిళల వార్నింగ్
Read Latest Telangana News And Telugu News