Share News

Pawan On Theaters Band: థియేటర్ల బంద్ ఎవరి పని.. విచారణ చేయాల్సిందే.. పవన్ ఆదేశం

ABN , Publish Date - May 27 , 2025 | 02:55 PM

Pawan On Theaters Band: సినిమా హాళ్ల బంద్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశించారు. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని స్పష్టం చేశారు.

Pawan On Theaters Band: థియేటర్ల బంద్ ఎవరి పని.. విచారణ చేయాల్సిందే.. పవన్ ఆదేశం
Deputy CM Pawan Kalyan On Theaters Band

అమరావతి, మే 27: సినిమా హాళ్ల బంద్ ప్రకటనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు (Deputy CM Pawan kalyan) మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) వివరాలు అందజేశారు. ఈ క్రమంలో సినిమా థియేటర్‌లు, సినీపరిశ్రమలో సమస్యలపై పవన్ కళ్యాణ్ మీడియా ప్రకటన విడుదల చేశారు. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. తన సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందని తెలిపారు. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశించారు. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని అన్నారు.


రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని అన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు కూడా టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని వెల్లడించారు. ఇందులో తనమన బేధాలు పాటించవద్దని తెలిపారు.


ప్రేక్షకులు సినిమా హాల్ వరకూ రావాలంటే.. టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు భారీగా ఉన్నాయన్నారు. వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటి అనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వెల్లడించారు. ధరల నియంత్రణ కూడా చేపట్టాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీ‌న్స్‌లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికిసూచించామన్నారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

కార్యకర్తలే నాకు స్ఫూర్తి: మంత్రి లోకేష్

పసుపు చొక్కాతో సీఎం చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ

Read Latest AP News And Telugu News

Updated Date - May 27 , 2025 | 02:57 PM