CM Chandrababu Kuppam Projects: కుప్పంలో ఏడు ప్రాజెక్టులకు శంకుస్థాపన.. భారీగా ఉద్యోగావకాశాలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:00 PM
కుప్పం నియోజకవర్గంలో రూ. రూ.2,203 కోట్లతో ఏర్పాటు చేయబోయే ఏడు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 23 వేల మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉంది.
అమరావతి, నవంబర్ 8: కుప్పంలో ఏడు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శంకుస్థాపన చేశారు. ఈరోజు (శనివారం) అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఏడు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం కుప్పంలో పరిశ్రమలు స్థాపించనున్న ప్రతినిధులతో మాట్లాడారు. అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. తాము పరిశ్రమలను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయా సంస్థల ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు.

కుప్పంలో ఏర్పాటు చేయనున్న తమ పరిశ్రమలకు సంబంధించిన నిర్మాణ ప్రణాళికలను సీఎంకు పారిశ్రామికవేత్తలు వివరించారు. మొత్తం రూ.2,203 కోట్లతో కుప్పంలో ఏడు సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ఏడు సంస్థలకు కుప్పంలో 241 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. డెయిరీ, ల్యాప్ టాప్, మొబైల్ ఎక్సెసరీస్, వంట నూనెల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వంటి పరిశ్రమలు కుప్పంలో ఏర్పాటు కానున్నాయి.
హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, SVF సోయా, మదర్ డైరీ, E–Royce EV, ALEAP మహిళా పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 23 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
సీఎంకు ధన్యవాదాలు..

మరోవైపు కుప్పం స్థానిక రైతులు, ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. హంద్రీ - నీవా కాల్వ ద్వారా నియోజకవర్గానికి నీళ్లు రావడం చాలా సంతోషంగా ఉందని కుప్పం స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కుప్పానికి ఈ తరహాలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు రావడంతో తమ ఉత్పత్తులను ఇక్కడి పరిశ్రమలకే విక్రయించే అవకాశం ఉంటుందని సీఎంకు రైతులు తెలిపారు. కుప్పానికి ఈ తరహాలో పరిశ్రమలు వస్తాయని తాము కలలో కూడా అనుకోలేదని మహిళా పాడి రైతులు అన్నారు. తల్లికి వందనం ద్వారా తాము లబ్దిపొందుతున్నామని సీఎంకు మహిళలు చెప్పారు. గతంలో ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చేదని... ఇప్పుడు పరిశ్రమలు రావడంతో వలస వెళ్లాల్సిన అవసరం లేదని స్థానికులు తెలిపారు. పరిశ్రమలు స్థాపించడం ద్వారా తమకు ఉపాధి కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కుప్పం వాసులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
భవిష్యత్లో వైసీపీ కనుమరుగవడం ఖాయం: బీజేపీ ఎమ్మెల్యే
అర్ధరాత్రి నడిరోడ్డుపై మందుబాబుల హంగామా.. ఏం జరిగిందంటే
Read Latest AP News And Telugu News