Liquor Scam Probe: అబద్ధాల కసిరెడ్డి
ABN , Publish Date - May 26 , 2025 | 03:49 AM
మూడు వేల కోట్ల మద్యం స్కాంలో సిట్ విచారణలో కసిరెడ్డి, మిథున్ రెడ్డి లు అబద్ధాలూ, తప్పుదోవ జవాబులూ ఇచ్చినట్టు తెలుస్తోంది. దర్యాప్తును మరింత లోతుగా చేపట్టి ప్రధాన లబ్ధిదారులపై ఉచ్చు బిగిస్తున్న సిట్ అధికారులు ఈడీతో కలసి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు.

పోలీసు విచారణలో చెప్పిందంతా తప్పే
ఏ-3తో క్రాస్ వెరిఫికేషన్లో బట్టబయలు
తప్పించుకునే ధోరణిలో సజ్జల శ్రీధర్ రెడ్డి
తప్పుదోవ పట్టించేలా మిథున్ రెడ్డి జవాబులు
లిక్కర్ నిందితుల వాంగ్మూలాలపై సిట్ స్ర్కూటినీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత ప్రభుత్వంలో జరిగిన మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణంలో అధికారులు, వ్యాపారులు, వైసీపీ నేతలు, గత ప్రభుత్వ పెద్దలు భాగస్వాములు. నాలుగు నెలలకు పైగా దర్యాప్తు చేసిన సిట్ 33 మంది నిందితులను గుర్తించింది. నోటీసులు, విచారణలు, అవసరం మేరకు సోదాలు, ఆ తర్వాత అరెస్టులు.. జరిగిపోయాయి. విచారణలో నిందితులు చెప్పిన సమాధానాలు ఎంత వరకు నిజం? అందులో అబద్ధాలు ఉన్నాయా? అన్నదానిపై సిట్ అధికారులు ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఓ వైపు ఫోరెన్సిక్ ఆధారాలు తీసుకున్న సిట్ అధికారులు.. మరోవైపు ఈ కుంభకోణంపై పూర్తి అవగాహన ఉన్న నిందితుల్ని పిలిపించి మరోమారు స్ర్కూటినీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏ3గా ఉన్న ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ను రెండు రోజులుగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఏ1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పినదాంట్లో చాలా వరకు అబద్ధాలు ఉన్నట్టు బయటపడింది. అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి (ఏ6) తప్పించుకునే ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. విజయసాయి రెడ్డి, చాణక్య, దిలీప్ దాదాపు వాస్తవాలు వెల్లడించగా, ఎంపీ మిథున్ రెడ్డి చెప్పిన వాటిలో ఎక్కువగా తప్పుదోవ పట్టించేలా ఉన్నట్లు తెలిసింది.
మళ్లీ కస్టడీలోకి కసిరెడ్డి!
మద్యం స్కామ్ ప్రణాళికలో తాడేపల్లి ప్యాలె్సతో పాటు నాటి ముఖ్యమంత్రి జగన్ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి(ఏ1), వైసీపీలో అప్పట్లో రెండో స్థానంలో ఉన్న విజయ సాయిరెడ్డి(ఏ5), రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి(ఏ4), సజ్జల శ్రీధర్ రెడ్డి(ఏ6) తదితరులు కీలక భూమిక పోషించారు. ప్రభుత్వమే షాపులు పెట్టి మద్యం విక్రయించాలనే పాలసీని రూపొందించడం నుంచి ముడుపులు ఇచ్చిన వ్యాపారులకే సరుకు ఆర్డర్లు ఇవ్వాలనే వరకూ ప్రతిదీ ప్లాన్ చేయడంలో ఈ బ్యాచ్కు ఎక్సైజ్ అధికారి డి.వి.సత్యప్రసాద్ బాగా ఉపయోగపడ్డారు. కడప జిల్లాకు చెందిన ఆయనకు అబ్కారీ శాఖలో లూప్హోల్స్ బాగా తెలుసు. సీఐడీ అధికారులు మొదట్లో సత్యప్రసాద్తో పాటు ఏపీఎ్సబీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి(ఏ2)ని కూడా పిలిచి విచారించారు. మద్యం కుంభకోణంలో బీజాల నుంచి ఫలాల వరకూ ప్రతిదీ పూసగుచ్చినట్లు వివరించారు. అంతిమంగా వైసీపీ పెద్దలు మూడున్నర వేల కోట్ల రూపాయల వరకూ ముడుపుల రూపంలో స్వాహా చేసినట్లు వెల్లడించారు. అంతా వీడియో రికార్డు చేసుకున్న సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ముందు మరోమారు రికార్డు చేయించారు. చట్టపరంగా ఎవరూ తప్పించుకోకుండా ఉండేందుకు దర్యాప్తు అధికారులు చేసిన ఈ పని ఇప్పుడు తాడేపల్లి ప్యాలె్సలో ప్రకంపనలు పుట్టించింది. మాజీ ముఖ్యమంత్రి రెండు గంటలకు పైగా ప్రెస్మీట్ పెట్టే పరిస్థితి తీసుకువచ్చింది. ఆయన చెప్పిన అబద్ధాలు చూసి విస్తుపోయిన సిట్ అధికారులు ఈ కేసులో నిందితుల్ని మరోమారు ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకూ అరెస్టైన ఏడుగురిలో నలుగురు వాంగ్మూలాలు ఇచ్చారు. అందులో ఏ1 రాజ్ కసిరెడ్డి చెప్పిన వాటిలో ఎక్కువగా అబద్ధాలు ఉన్నట్లు అధికారులు సందేహించారు. మరోమారు క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఏ3 సత్యప్రసాద్ను విజయవాడలోని సిట్ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించినట్లు సమాచారం. ఆయన చెప్పినవనీ అండర్లైన్ చేసుకున్న సిట్ అధికారులు మరో మూడు రోజుల పాటు రాజ్ కసిరెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిద్ధమయ్యారు.
ముందే శిక్షణ
నేరాలు చేసే కేడీలు పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలి? పట్టుబడినా అబద్ధాలు ఎలా చెప్పాలి? అనే వాటిపై ముందుగానే మానసికంగా సిద్ధమవుతారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు మరింత తెలివిగా ఉంటారు. ముందుగానే రిటైర్డ్ పోలీసు అధికారులు, న్యాయవాదులతో ట్రైనింగ్ తీసుకుంటారు. విచారణలో దర్యాప్తు అధికారులు ఏమేమి అడుగుతారు? సమాధానాలు ఎలా చెప్పాలి? కోర్టులో ఏం చెప్పాలి? అనే వాటిపై పూర్తి కసరత్తు చేస్తారు. ఇక ప్రభుత్వ పెద్దలు, అధికారులతో కలిసి ఇలాంటి కుంభకోణాలకు పాల్పడేవారు మరింత ముదుర్లుగా తయారవుతారు. 11 సీబీఐ కేసులు, ఆరు ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ రెడ్డి కేసులు వాదిస్తున్న న్యాయవాదులు, వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలకు సహకరించిన ఖాకీలు హైదరాబాద్లో లిక్కర్ నిందితులకు శిక్షణ ఇచ్చారు. తదనుగుణంగానే సిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు అబద్ధాలు చెప్పినట్లు తెలిసింది. విజయసాయిరెడ్డి, చాణక్య, దిలీప్ సరైన శిక్షణ తీసుకోలేదేమో దాదాపు వాస్తవాలు వెల్లడించారు.
ఆ ముగ్గురితో నిజాలు కక్కిస్తే..
మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధ్దిదారుకు ఒక అడుగు ముందున్న నిందితులు ముగ్గురు. వారే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎ్సడీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప. మద్యం సేవించే పేదల నుంచి షాపులకు.. అక్కడి నుంచి బేవరేజెస్ కార్పొరేషన్కు.. మూడో దశలో మద్యం వ్యాపారులకు చేరిన సొమ్ము.. నాలుగో దశలో క్యాష్ హ్యాండ్లర్స్ ద్వారా ముడుపుల రూపంలో రాజ్ కసిరెడ్డికి చేరింది. ఆ తర్వాత ఐదో దశలో ఈ ముగ్గురికీ చేరినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇక అంతిమ లబ్ధిదారుకు చేరిన వైనాన్ని ఛేదించబోతున్నారు. ఆధారాలతో సహా వెలికి తీయడమే ఈ కేసు విచారణలో కీలకం. అందుకు సిట్ అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోడైంది. అసలు దోపిడీదారుకు ఉచ్చు బిగుస్తున్నారు. ఐదేళ్ల పాటు తాడేపల్లి ప్యాలె్సలో చక్రం తిప్పిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్పతో నిజాలు కక్కిస్తే కేసు ఓ కొలిక్కి చేరుకుంటుంది.