TDP Mahanadu 2025: తెలుగు జాతికి పండుగ రోజు.. మహానాడులో ఏపీ సీఎం
ABN , Publish Date - May 28 , 2025 | 11:04 AM
TDP Mahanadu 2025: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహంపై పూలుజల్లి నివాళులర్పించారు. తెలుగుజాతి ఆరాధించే మహానేత ఎన్టీఆర్ అని సీఎం కొనియాడారు.

కడప, మే 28: టీడీపీ మహానాడు (TDP Mahanadu) రెండవ రోజు ప్రారంభమైంది. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ముఖ్యనేతలు నివాళులర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మహానాడు తొలిరోజు కీలక అంశాలపై చర్చించుకున్నామన్నారు. పార్టీ బలోపేతం, ప్రజలకు మేలు చేసేలా చర్చలు జరిగాయన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మగౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ రాజకీయ సార్వభౌముడు ఎన్టీఆర్ జయంతి నేడు అని అన్నారు. తెలుగుజాతి ఆరాధించే మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగుజాతికి పండగ రోజు అని అన్నారు. ప్రతీ ఒక్కరూ స్మరించుకునే రోజన్నారు. యుగ పురుషుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.
ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదన్నారు సీఎం. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ములుపులు, మెరుపులు, మజిలీలు ఉన్నాయన్నారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్గా ఎదిగారన్నారు. ప్రజల కోసం పార్టీ పెట్టి సీఎం అవడం అనితరసాధ్యమన్నారు. ఎన్టీఆర్ జీవితం పూలపాన్పు కాదని, నిరంతరం పోరాటాలతోనే ఎదిగారన్నారు. స్వీయ క్రమశిక్షణ, నీతినిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలన్నారు. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి.. 33 ఏళ్ల వెండితెర జీవితంలో, 13 సంవత్సరాల రాజకీయ జీవితంలో అద్వితీయ చరిత్ర సృష్టించారని కొనియాడారు.
ఎన్టీఆర్ రూపు చూసి ఏ సంకల్పం చేసినా సాధించి తీరుతారని తెలిపారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయి రికార్డు సృష్టించారన్నారు. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా.. రైతులకు నేస్తం... యువతకు భవిష్యత్తు అని వెల్లడించారు. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. తనను వెండితెర ఇలవేల్పును చేసిన తెలుగు ప్రజల రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారని.. ఎంత కష్టమైనా వెనుకడుగు వేయలేదన్నారు. 60 ఏళ్లలో రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించారన్నారు. ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు. 2024 ప్రజల తీర్పుతో విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు వెళ్తున్నామని అన్నారు. పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఆ దేశానికి యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆఫర్
ఎన్టీఆర్కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి
Read Latest AP News And Telugu News