CM Chandrababu: సమాజంపై రామోజీరావు వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 08 , 2025 | 07:33 AM
సమాజంపై రామోజీరావు వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదని సీఎం చంద్రబాబు కొనియాడారు. రామోజీ గ్రూపు అంటేనే విశ్వసనీయతకు నిలువెత్తు రూపమని అన్నారు. పత్రిక అంటే సమాచార స్రవంతి మాత్రమే కాదని, ప్రజా ప్రయోజనాల కోసం పోరాడే ఖడ్గం అని పాత్రికేయానికే కొత్త అర్థాన్ని రామోజీరావు ఇచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు.

అమరావతి: తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి పద్మవిభూషణ్ రామోజీరావు (RamojiRao) ఇవాళ(ఆదివారం) ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ అక్షర యోధునికి నివాళులు అర్పిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
అరాచక వ్యవస్థలపై పోరాటం..
‘నేడు ఆయన మన మధ్య లేకపోయినా... విలువలతో కూడిన పాత్రికేయంతో, నిష్పక్షపాత జర్నలిజంతో సమాజంపై రామోజీరావు వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదు. రామోజీరావు ఎగరేసిన అక్షర బావుటా నిత్య సత్యమై, నిత్య నూతనమై ప్రతి రోజూ ఉషోదయాన నినదిస్తూనే ఉంది. తలవంచని నైజం, వ్యాపారాల్లో కూడా సమాజ హితం చూసిన వైనం ఆయనను సమున్నత స్థాయిలో నిలబెట్టింది. ఈనాడు సంస్థల ద్వారా అరాచక వ్యవస్థలపై రామోజీరావు చేసిన పోరాటాలు....ప్రజల సమస్యలపై ఆయన చేసిన యుద్ధాలు మీడియా రంగానికే తలమానికంగా నిలిచాయి. రామోజీ గ్రూపు అంటేనే విశ్వసనీయతకు నిలువెత్తు రూపం. పత్రిక అంటే సమాచార స్రవంతి మాత్రమే కాదని, ప్రజా ప్రయోజనాల కోసం పోరాడే ఖడ్గం అని పాత్రికేయానికే కొత్త అర్థాన్ని ఇచ్చి న మహర్షి రామోజీరావు. సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన, సమాజాన్ని అనునిత్యం చైతన్యవంతం చేసిన వారిని స్మరించుకోవడం తెలుగు ప్రజలందరి బాధ్యత. ఒక్క మాటలో చెప్పాలంటే రామోజీరావు తెలుగు జాతి సంపద. ఆయన వెళ్లిపోయినా ఆయన నింపిన స్ఫూర్తి అందరిలో నిలిచే ఉంటుంది. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా నిత్య స్ఫూర్తిగా నిలిచే ఆయన జీవితాన్ని మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దు
కన్నప్పలో బ్రాహ్మణులను కించపరిచారు
Read Latest AP News And Telugu News