Share News

Digital Evaluation Scam: గ్రూప్‌-1 కేసు ఏ2 ఆఫీసులో సోదాలు

ABN , Publish Date - May 06 , 2025 | 04:19 AM

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 నోటిఫికేషన్‌లో అక్రమాలపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కామ్‌సైన్‌ కంపెనీ ద్వారా డిజిటల్ మూల్యాంకనం జరిపి అక్రమంగా 1.14 కోట్లు తీసుకున్న ఆఫీసర్లపై విచారణ జరుగుతోంది.

Digital Evaluation Scam: గ్రూప్‌-1 కేసు ఏ2 ఆఫీసులో సోదాలు

  • హైదరాబాద్‌లో ‘కామ్‌సైన్‌’ డైరెక్టర్‌ మధును విచారించిన పోలీసులు

  • డిజిటల్‌ మూల్యాంకనం చేసింది ఈ సంస్థే.. కేసులో ఏ2గా చేర్చిన అధికారులు

  • కీలక పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం.. హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనంపై ఆరా

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాం నాటి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) నియామకాల్లో జరిగిన అక్రమాలు వెలికితీస్తున్న విజయవాడ పోలీసులు కీలక ముందడుగు వేశారు. వైఎస్‌ అభిమాని, జగన్‌ సన్నిహితుడు ‘కామ్‌సైన్‌’ కంపెనీ డైరెక్టర్‌లలో ఒకరైన పమిడికాల్వ మధుసూదన్‌ను విజయవాడ పోలీసులు హైదరాబాద్‌లో సోమవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. వైఎస్‌ సహకారంతో మధుసూదన్‌ 2008లో ‘కామ్‌సైన్‌’ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ప్రారంభించారు. కరోనా సమయంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మూల్యాంకనం ఈ సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహించారు. దీంతో ఈ కంపెనీని ఏ-2గా పేర్కొన్నారు. వాస్తవానికి మాన్యువల్‌ విధానాన్ని కాదని, డిజిటల్‌ మూల్యాంకనం చేసి రూ.1.14 కోట్లు తీసుకున్న కామ్‌సైన్‌ కంపెనీ డైరెక్టర్‌ హోదాలో ఆయనపై కేసు నమోదైంది. గ్రూప్‌-1 మూల్యాంకనం అక్రమాల్లో అసలు సూత్రధారి అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు కాగా, రెండో నిందితుడిగా మధుసూదన్‌పై ఇటీవల సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌కు వెళ్లిన బెజవాడ పోలీసులు బంజారా హిల్స్‌లోని పంచవటి కాలనీలో ఉన్న కార్యాలయంలో మధుసూదన్‌ను ప్రశ్నించారు. అప్పట్లో ఏం జరిగింది.. ఏపీపీఎస్సీ కార్యాలయంలో కాకుండా ప్రైవేటు రిసార్ట్స్‌లో డిజిటల్‌ మూల్యాంకనం ఎందుకు చేశారు? అలా చేయమని పీఎస్ఆర్‌ ఆంజనేయులు చెప్పారా? ఏపీపీఎస్సీ నుంచి ఎవరైనా అడిగారా? మీరే ప్రభుత్వ పెద్దల నుంచి పైరవీ చేయించుకున్నారా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. అప్పట్లో డిజిటల్‌ మూల్యాంకనానికి వినియోగించిన ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


అక్రమాలకు వేదిక హాయ్‌ల్యాండ్‌

వైసీపీ హయాంలో పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలోనే గ్రూప్‌-1లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఏపీపీఎస్సీ ఆఫీసుతో సంబంధం లేని గుంటూరు హాయ్‌ల్యాండ్‌ రిసార్ట్స్‌లో మూల్యాంకనం చేయించడమే అక్రమాలకు వేదికైంది. అయితే, ఆ తర్వాత మళ్లీ రెండోసారి మూల్యాంకనం చేయించినా, రెండుసార్లు జరిగిందనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వం దాచిపెట్టింది. హాయ్‌ల్యాండ్‌ అనే పేరు కూడా తమకు తెలియదన్నట్టుగా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొయింది. హాయ్‌ల్యాండ్‌లో మొదటిసారి మూల్యాంకనానికి చేసిన ఏర్పాట్లు, చెల్లింపుల వివరాలను అభ్యర్థులు ఆధారాలతో సహా నిరూపించడంతో హైకోర్టు ఏకంగా మెయిన్స్‌ను కొట్టివేసింది. అయితే, ఈ మొత్తం వ్యవహారం వెనుక చక్రం తిప్పింది పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు అని విచారణాధికారులు భావిస్తున్నారు. 2018లో ఏపీపీఎస్సీ 169 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. దీనిలో మాన్యువల్‌ విధానం(చేతితో దిద్దే)లో మెయిన్స్‌ మూల్యాంకనం జరుగుతుందని పేర్కొంది. వైసీపీ హయాంలో 2020, డిసెంబరు 14 నుంచి 20 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరగ్గా 6,807 మంది అభ్యర్థులు మెయిన్స్‌ రాశారు. అయితే, కరోనా కారణం చూపుతూ ఏపీపీఎస్సీ మాన్యువల్‌గా కాకుండా డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేయించింది. దీనిపై అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లడంతో నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా(మాన్యువల్‌) మూల్యాంకనం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.


పీఎస్ఆర్‌ డిజిటల్‌.. సవాంగ్‌ మాన్యువల్‌..

మూల్యాంకనం చేసే ప్రొఫెసర్లకు ఏర్పాట్లు, ఇతర సిబ్బందికి కామ్‌సైన్‌ అనే కంపెనీకి రూ.1.14 కోట్లు చెల్లించారు. 2021, డిసెంబరులో ప్రారంభించిన మూల్యాంకనానికి హాయ్‌ల్యాండ్‌లో 26 రోజుల హాల్‌ అద్దె, సిబ్బందికి భోజనాలు, ఇతర అవసరాలు అంటూ రూ.20.06 లక్షలు చెల్లించారు. ఓఎంఆర్‌ షీట్లు, డిజైన్‌ కోసం మరో కంపెనీకి కూడా నిధులు విడుదల చేశారు. హాయ్‌ల్యాండ్‌లో జవాబుపత్రాలకు భద్రత కోసం కర్నూలు పోలీస్‌ యూనిట్‌ నుంచి 15 రోజులకు ఒక బ్యాచ్‌ చొప్పున 32 మంది సిబ్బందిని నియమించారు. 2021, డిసెంబరు 5 నుంచి 2022, ఫిబ్రవరి 26 వరకు వారు అక్కడే ఉన్నారు. అంతకముందు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌కు జవాబుపత్రాల తరలింపునకు గుంటూరు అర్బన్‌ ఎస్పీకి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు లేఖ రాశారు. అనంతరం ఏపీపీఎస్సీ రెండోసారి మాన్యువల్‌గా జవాబుపత్రాలు మూల్యాంకనం చేయించి తుది ఫలితాలు ప్రకటించింది. రెండోసారి ఏపీపీఎస్సీ కార్యాలయంలోనే మూల్యాంకనం జరిగింది. అంతకంటే ముందే పీఎ్‌సఆర్‌ బదిలీ జరిగింది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన గౌతం సవాంగ్‌ డిజిటల్‌ మూల్యాంకనాన్ని కట్టుకథగా తోసిపుచ్చారు. మొదటిసారి మాన్యువల్‌ మూల్యాంకనం చేసినప్పుడు తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థులు ఎంపిక కాలేదనే ఉద్దేశంతో రెండోసారి మూల్యాంకనం చేశారని, ఫలితంగా డిజిటల్‌ మూల్యాంకనానికి, రెండోసారి మాన్యువల్‌ మూల్యాంకనానికి మధ్య ఎంపికైన అభ్యర్థుల్లో 62 శాతం వ్యత్యాసం వచ్చిందని అభ్యర్థులు వాదించారు. డిజిటల్‌ మూల్యాంకనం చేసినప్పుడు ఇంటర్వ్యూలకు 326 మందిని ఎంపిక చేయగా, వారిలో 202 మంది రెండోసారి మాన్యువల్‌ మూల్యాంకనంలో అనర్హులయ్యారు,


అక్రమాల అంజన్న

అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో అంజన్నగా పిలిపించుకున్న పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు అన్నీ తానై వ్యవహరించి.. డిజిటల్‌ మూల్యాంకనంపై నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఏ పోటీ పరీక్షల మూల్యాంకనం అయినా ఏపీపీఎస్సీ కార్యాలయంలోనే జరగాలి. కానీ, దానికి విరుద్ధంగా వ్యవహరించిన పీఎ్‌సఆర్‌ ప్రైవేటు రిసార్ట్స్‌కు జవాబుపత్రాలను తరలించారు. పైగా ఏర్పాట్ల కోసం రూ.1.14 కోట్లు చెల్లించారు. అసలు ప్రైవేటుకు ఎందుకు వెళ్లారనే కోణంలోనే ఇప్పుడు పీఎ్‌సఆర్‌పై నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు కంపెనీలకు మేలు చేయడం కోసమే మూల్యాంకనాన్ని అక్కడికి మార్చారా? కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం చేశారా? అనే రహాస్యాన్ని తేల్చేపనిలో నిమగ్నమయ్యారు.

Updated Date - May 06 , 2025 | 04:20 AM