Pawan Kalyan: వైసీపీ నేతల బూతులు, బుద్ధులు మారడం లేదు: డిప్యూటీ సీఎం సీఎం పవన్ కల్యాణ్
ABN , Publish Date - Nov 26 , 2025 | 03:05 PM
గతేడాది ఇదే సమయంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను ప్రభుత్వం చేపట్టింది.
అమలాపురం, నవంబర్ 26: కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్ల సమయం ఇవ్వాలని ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. కొబ్బరిచెట్టును పెద్దకొడుకుగా ఎలా భావిస్తారో.. అలాగే కూటమి ప్రభుత్వాన్ని భావించాలని ప్రజలను ఆయన కోరారు. బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని శివ కోడులో పల్లె పండుగ 2.0 పేరిట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఈ రోజుకి వైసీపీ నేతలు బూతులు, బుద్ధులు మారడం లేదని మండిపడ్డారు.
ప్రజాస్వామ్య బద్ధంగా విమర్శించండి.. సరిదిద్దుకుంటామంటూ వైసీపీ నేతలకు పవన్ కల్యాణ సూచించారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ గమనిస్తున్నామన్నారు. తీరు మారకపోతే పవన్ కల్యాణ్లో గట్టిదనం చూస్తారంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. 2029లో అధికారంలోకి వచ్చేస్తామంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని.. రాజోలు గడ్డ మీద నుంచి చెబుతున్నా అది జరగదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమ పార్టీలో ఎవరు తప్పు చేసినా తాను క్షమించనన్నారు. గ్రామ సమస్యలపై నిలదీయాలంటూ ఈ సందర్భంగా యువతకు పవన్ కల్యాణ్ సూచించారు.
పల్లె పండుగ..
2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలకు ఏపీ ఓటరు పట్టం కట్టాడు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. గ్రామీణ ప్రాంతాల రూపు రేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. దాంతో గతేడాది ఇదే సమయంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద దాదాపు రూ. 4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈ ఏడాది కూడా పల్లె పండగ 2. 0 కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఏడాది రూ.6,500 కోట్ల వ్వయంతో 52,000 పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఘరానా మోసం.. 400 మంది నిరుద్యోగుల డబ్బు స్వాహా
బర్త్ డే పార్టీ పేరుతో పిలిచి.. యువకుడిపై పెట్రోల్ పోసి..
For More AP News And Telugu News