ఆ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర: పవన్
ABN , Publish Date - Jun 09 , 2025 | 03:19 AM
రాజధాని అమరావతిపై కుల ముద్రలు వేసి, మహిళలను అవమానిస్తారా..? ఇక్కడ వెలసిల్లిన బౌద్దాన్నీ అవహేళన చేస్తారా..?’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

కఠిన చర్యలు తథ్యం: డిప్యూటీ సీఎం పవన్
పోలీసులు చట్ట ప్రకారం ముందుకెళ్తారు
అమరావతిపై దుష్ప్రచారమే ఆ ముఠా ఉద్దేశం
అమరావతి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ‘రాజధాని అమరావతిపై కుల ముద్రలు వేసి, మహిళలను అవమానిస్తారా..? ఇక్కడ వెలసిల్లిన బౌద్దాన్నీ అవహేళన చేస్తారా..?’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అమరావతి మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజధానిపై కుట్రలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘రాజధాని అమరావతి ప్రాంతంపై ఒక చానల్లో జర్నలిస్టు ముసుగులో ఒక వ్యక్తిచేసిన దారుణ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర దాగి ఉంది. వైసీపీ టీవీ చానల్ ద్వారా రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అని కామెంట్ చేయించారు. దారుణ వ్యాఖ్యలతో మహిళలను అవమానించారు. అంటే.. ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కమ్మ, కాపు, ఇతర సామాజిక వర్గాల మహిళలందరినీ అవమానించడమే కదా..’ అని పవన్ ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని.. అది సదరు వ్యక్తి అభిప్రాయం మాత్రమేనని ఆ చానల్ కూడా తప్పించుకోలేదన్నారు. వాటిని ప్రసారం చేయడమే కాకుండా.. చర్చ సందర్భంగా కనీసం ఖండించి, తప్పుబట్టలేదన్నారు. ఇలాంటి కుట్రలు, దుష్ప్రచారం చేసిన వ్యక్తులపైనా, వారి వెనుక ఉన్న వారిపైనా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. నీచ వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.