Anathapuram : డిజిటల్ సాక్ష్యాలతో హత్యానేరం రుజువు
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:58 AM
డిజిటల్ సాక్ష్యాలు, అధికారుల నివేదికల ఆధారంగా ఓ హత్య కేసులో నేరం రుజువైనట్లు అనంతపురం జిల్లా కోర్టు స్పష్టం చేసింది.

ఐదుగురు ముద్దాయిలకు జీవిత ఖైదు
అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు
2022లో నార్పలలో యువకుడి హత్య
అనంతపురం క్రైం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రత్యక్ష సాక్షులు సాక్ష్యం చెప్పకపోయినా, డిజిటల్ సాక్ష్యాలు, అధికారుల నివేదికల ఆధారంగా ఓ హత్య కేసులో నేరం రుజువైనట్లు అనంతపురం జిల్లా కోర్టు స్పష్టం చేసింది. జిల్లాలోని నార్పల మండల కేంద్రానికి చెందిన మట్టి పవన్కుమార్ హత్య కేసులో ఐదుగురికి కఠిన జీవిత ఖైదును విధిస్తూ జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్ సోమవారం తీర్పునిచ్చారు. ఈ కేసులో మొదటి ముద్దాయి డిపో సాజిద్కు హతుడు ఒకనాటి స్నేహితుడు. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి గొడవపడ్డారు. ఈ క్రమంలో డిపో సాజిద్తోపాటు అతని అనుచరుడు తలారి సుధాకర్ను చంపుతానని పవన్ కుమార్ బెదిరించేవాడు. గొడవలు తీవ్రం కావడంతో పవన్కుమార్ తన తల్లిదండ్రులతో కలిసి అనంతపురంలో ఉంటున్నాడు. 2022, ఏప్రిల్ 12న పవన్కుమార్ నార్పలకు రాగా, తహసీల్దార్ కార్యాలయంలో డిపో సాజిద్ తారసపడ్డాడు. ఇద్దరూ మరోసారి ఘర్షణపడ్డారు. ఈ క్రమంలో సాజిద్పై పవన్కుమార్ కత్తితో దాడి చేయడంతో చేతికి గాయాలయ్యాయి.
అదే రోజు రాత్రి సాజిద్ తన అనుచరులు చింతాకు రమేశ్, చిక్కేపల్లి నాగేంద్ర, తలారి సుధాకర్, తలారి అరుణ్ను వెంట పెట్టుకుని పవన్కుమార్ కోసం వెతికారు. రాత్రి 10.30 గంటల సమయంలో నార్పలలోని వడ్డే తిమ్మన్నతోట సమీపంలో పవన్కుమార్ ఉన్నాడని తెలుసుకుని అక్కడికెళ్లారు. సాజిద్, సుఽధాకర్, అరుణ్ స్టీల్రాడ్డు, కర్రలతో పవన్ కుమార్ను అతి దారుణంగా కొట్టారు. ఆ దాడి దృశ్యాలను చిత్రీకరించాలని చిక్కేపల్లి నాగేంద్రకు సుధాకర్ సూచించాడు. ‘‘ఈ వీడియో చూసినవారు మనమంటే భయపడాలి.. సుధాకర్ అంటే ఒక బ్రాండ్’’ అని వ్యాఖ్యానిస్తూ దాడి కొనసాగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. పోలీసులు దాన్ని కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. కేసు విచారణ సమయంలో ప్రత్యక్ష సాక్షులు సాక్ష్యం చెప్పకపోయినా, ఈ వీడియో, అధికారులిచ్చిన నివేదికల ఆధారంగా నేరం రుజువైంది. ముద్దాయిలందరికీ కఠిన జీవిత ఖైదు విధిస్తూ జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది రాచమల్లు హరినాథ్రెడ్డి వాదనలు వినిపించారు.
16 లక్షలు పోశాం!
ఈ కేసులో రాజీ కుదుర్చుకునేందుకు న్యాయవాదుల సమక్షంలో డబ్బులిచ్చామని ముద్దాయిల తల్లిదండ్రులు ఆరోపించారు. ఐదుగురి తరఫున మొత్తం రూ.16 లక్షలు ఇచ్చామని తెలిపారు. కోర్టు తీర్పు వెలువడగానే ముద్దాయిల తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. హతుడి కుటుంబ సభ్యులకు డబ్బులిచ్చినా రాజీ కుదరలేదని కన్నీటి పర్యంతమయ్యారు. హత్యకు గురైన పవన్కుమార్ గతంలో ఓ కానిస్టేబుల్ను పొడిచినా, మరిన్ని అరాచకాలు చేసినా కేసులు పెట్టలేదని అన్నారు. అలాంటి వాణ్ణి చంపిన తమ వారిని జైలుకు పంపుతున్నారని వాపోయారు.