Share News

CM Chandrababu : ఇంకా శ్రమించాలి!

ABN , Publish Date - Feb 04 , 2025 | 03:56 AM

కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థతో వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆక్సిజన్‌ అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu : ఇంకా శ్రమించాలి!
CM Chandrababu Naidu

  • వైసీపీ పాలనలో 20-30 ఏళ్లు వెనక్కి

  • నిత్యం కేంద్రంతో టచ్‌లో ఉన్నాం

  • బడ్జెట్‌తో రాష్ట్రానికి ‘ఆక్సిజన్‌’

  • సమస్యల పరిష్కారం.. నిధులూ!

  • మోదీ నేతృత్వంలో బలమైన బ్రాండ్‌ ఇండియా

  • జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం సరళతరం చేయాలి

  • పేదలకు సంపన్నుల చేయూతపై చర్చ జరగాలి

  • సంపద సృష్టించకుండా పంచే హక్కు లేదు

  • ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ 20-30 సంవత్సరాలు వెనక్కు వెళ్లిందని, కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థతో వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆక్సిజన్‌ అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జరిగిన నష్టం పూరించడానికి ఇంకా శ్రమించాల్సి ఉందని... ఏపీ విషయంలో నిత్యం కేంద్రంతో టచ్‌లోనే ఉన్నామని చెప్పారు. ఏడు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయని, నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రాజధాని అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ, రైల్వేజోన్‌, పారిశ్రామిక పార్కులకు నిధులు లభిస్తున్నాయన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఏపీ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ... కేటాయింపులపరంగా రాష్ట్రానికి మేలు జరిగిందని ఆయన చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేసేందుకు ఆదివారం రాజధానికి చేరుకున్న చంద్రబాబు సోమవారం ఉదయం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘బడ్జెట్‌ గురించి కొందరు సంకుచితంగా మాట్లాడుతున్నారు. ఏపీకి (కేంద్ర బడ్జెట్‌లో) ఏమేమొచ్చాయని అడుగుతున్నారు. మాకు అన్నీ లభించాయని అని వారికి చెప్పాను. మనకు శక్తి ఉండి, మన పరిపాలన బాగుంటే నంబర్‌ వన్‌గా మనం నిలిచేలా కేంద్రం చేయూత ఉంది’’ అని వివరించారు. ఇండియా కూటమి- ఎన్డీఏ రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదన్నారు. ‘‘నాకు అభివృద్ధి, దేశ భవిష్యత్‌ ముఖ్యం. సరైన అభివృద్ధే సరైన రాజకీయం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.ఢిల్లీలో ఆప్‌ తాయిలాల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ....దేశంలో సంపద పెంచకుండా పంచడం సరైంది కాదని, దీనిపై చర్చ జరగాలన్నారు.


సంపద సృష్టించకుండా దానిని పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడిది అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీది వైఫల్య నమూనా అని ఆయన వ్యాఖ్యానించారు. జీఎస్టీని సరళతరం చేయాలని, అందరూ సులభంగా చెల్లించేలా ఉండాలని ఆయన సూచించారు. సంపదను కొందరు సృష్టిస్తే కొందరు వచ్చి నాశనం చేస్తార ంటూ... వైసీపీ గురించి పరోక్షంగా విమర్శించారు. అభివృద్ధిని చౌకబారు అవసరాల కోసం పట్టాలు తప్పించడం సరికాదనీ, ఎవరు అధికారంలో ఉన్నా అభివృద్ధిని కొనసాగాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

15 శాతం వృద్ధే లక్ష్యం..

‘‘కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో నాకు పూర్తి ఏకీభావముంది. స్వర్ణాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి రేటుకు తాను సూచించిన పదిసూత్రాలు బడ్జెట్‌లో ఉన్నాయి. స్వర్ణాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి వికసిత్‌ భారత్‌తో ముడిపడి ఉంది. ఇందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ ఏడాది 12.94 శాతం అభివృద్ధిని చూపించాం. వచ్చే ఏడాది 15 శాతం సాధించే దిశగా కృషి చేస్తాం.’’

ఏఐ.. గ్రీన్‌ ఎనర్జీలో భారత్‌ భేష్‌

‘‘గత11 సంవత్సరాల తన పాలనలోభారతీయులు గర్వపడేలా నరేంద్రమోదీ పని చేశారు. మోదీ నాయకత్వంలో బ్రాండ్‌ ఇండియా బలంగా ఉంది. భారతీయులందరికీ ఇది అత్యంత స్ఫూర్తిదాయకమైన సమయం. ప్రపంచమంతా భారత దేశంవైపే చూస్తోంది. ఇటీవల దావోస్‌ లో పర్యటించినప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం పట్ల ఆసక్తి ప్రదర్శించడాన్ని గమనించాను. 1995లో నేను ప్రారంభించినఐటీ విప్లవం ఇప్పుడు ఏఐ విప్లవం దాకా పయనించింది. భారత దేశం రెండింటిలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ప్రపంచమంతటికీ తెలుసు. ఆరోజు నేను ఐటీ విప్ల వంలో పాత్ర పోషించాను. దాని శక్తి ఇప్పుడు అంతటా కనపడుతోంది. ఇప్పుడు ఏఐ కోసం పని చేస్తున్నాను. ప్రపంచంలో భారతీయులను ఇతర దేశస్థుల కంటే ఎక్కువగా ఆమోదిస్తున్నారు. ఏఐ తర్వాత హరిత ఇంధనం (గ్రీన్‌ ఎనర్జీ) పై ప్రపంచం దృష్టి కేంద్రీకృతమైంది. వీటిలో భారత్‌ బలంగా ఉంది.’’


సామాజిక సేవకు పౌర పురస్కారాలు

‘‘విద్యుత్‌ రంగంలో తొలుత రెగ్యులేటరీ కమిషన్‌ స్థాపించి సంస్కరణలు ప్రవేశపెట్టింది నేనే. ఇప్పుడు అన్ని విభాగాల్లో రెగ్యులేటరీ కమిషన్లు వచ్చాయి. ఆర్థిక సంస్కరణల వల్ల ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వచ్చింది. సంక్షేమం వాస్తవం. దాన్ని కాదనలేం. అయితే సంపద చివరి వరకు ఎలా పంచాలన్నదే నా ధ్యేయం. అత్యంత సంపన్నులైనవారు పేదల్లో పదిశాతాన్ని దత్తత తీసుకుని చేయూతనివ్వాలి. దీనిపై ముందు చర్చించాలి. అవసరమైతే చట్టం చేయాలి. ప్రజల పట్ల సామాజిక బాధ్యతతో వ్యవహరించినవారికి పద్మశ్రీ, పద్మభూషణ్‌, భారత రత్న లాంటి అవార్డులివ్వాలి. సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ గురించి కూడా చర్చించవచ్చు..’’

కమ్యూనిజం లేదు.. ఉన్నది టూరిజమే..

‘‘తెలంగాణలో కుల సర్వే జరపడం తప్పేమీ కాదు. కులం, ప్రాంతం, మతం అనేవి వాస్తవికతలు. వాటిని గౌరవించి అందరి అభివృద్ధి కోసం కృషి చేయాలి. సిద్ధాంతం గురించి మాట్లాడడం వ్యర్థం. కమ్యూనిజం అనేది లేదని టూరిజం ఒక్కటే ఉన్నదని గతంలోనే చెప్పాను. చైనా రాజకీయంగా కమ్యూనిస్టు దేశమైనా, అభివృద్ధి, ఆర్థిక వ్యవహారాల్లో కమ్యూనిజాన్ని ఆ దేశం అవలంబించడం లేదు.’’

ఢిల్లీది వైఫల్య నమూనా

‘‘గత పదేళ్లలో ఆమ్‌ ఆద్మీ పార్టీ హయాంలో ఢిల్లీలో పాలన పూర్తిగా విఫలమైంది. ఢిల్లీలో మద్యం కుంభకోణం నా దృష్టిలో అన్నిటికన్నా చాలా ఘోరమైంది. ఢిల్లీది వైఫల్య నమూనా. 1995లో నేను హైదరాబాద్‌ నమూనాను ఇచ్చాను. హైదరాబాద్‌ వల్లే తెలంగాణ తలసరి అదాయం పెరిగింది. సంపద సృష్టించకుండా ఎలా పంచుతారు? దీనిపై చర్చించాలి.’’


గురజాడ స్ఫూర్తితో నిర్మల బడ్జెట్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గురించి కొందరు సంకుచితంగా మాట్లాడుతున్నారని, అందులో వాస్తవం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘దేశమంటే మట్టి కాదోయే, దేశమంటే మనుషులోయ్‌’ అంటూ తెలుగు కవి గురజాడ అప్పారావు కవితతో తన ప్రసంగాన్ని నిర్మలా సీతారామన్‌ ప్రారంభించారు. గురజాడ స్ఫూర్తిని కేంద్ర బడ్జెట్‌ ప్రతిబింబించింది. మనుషులకు సాధికారికత కల్పించడమే బడ్జెట్‌ లక్ష్యం. మధ్యతరగతి దేశంలో చాలా ముఖ్యమైంది. అత్యధిక ప్రజలు పేదరికం నుంచి బయటపడి మధ్యతరగతిలోకి ప్రవేశిస్తున్నందువల్ల 12 లక్షల వరకు ఆదాయపు పన్ను రాయితీని వారికి కల్పించడం సరైన నిర్ణయమే’’నని చంద్రబాబు అన్నారు.

ఉదారంగా నిధులు కేటాయించండి

ఫైనాన్స్‌ కమిషన్‌కు చంద్రబాబు విజ్ఞప్తి

గత ప్రభుత్వ పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని కేంద్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ దిలీప్‌ పనగారియాకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో నీతీ ఆయోగ్‌ ఇచ్చిన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని, ఈ దృష్ట్యా నిధుల కేటాయింపు విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కోరారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి గత వైసీపీ పాలనలో మరింత నష్టం కలిగిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పనగారియాకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.


Read Latest Andhra Pradesh News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 07:47 AM