CHITTOOR: మదనపల్లె రెవెన్యూలోకి పుంగనూరు
ABN , Publish Date - May 21 , 2025 | 01:46 AM
31 మండలాలున్న చిత్తూరు జిల్లాలో మరో 5 మండలాలు తగ్గిపోనున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని 5 మండలాలను మదనపల్లె రెవెన్యూ సబ్ డివిజన్లో కలపనున్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ పెట్టిన ప్రతిపాదన మేరకు మండలాలను విభజిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసేందుకు మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

చిత్తూరులో ఇంకా తగ్గిపోనున్న మండలాల సంఖ్య
చిత్తూరు, మే 20 (ఆంధ్రజ్యోతి): 31 మండలాలున్న చిత్తూరు జిల్లాలో మరో 5 మండలాలు తగ్గిపోనున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని 5 మండలాలను మదనపల్లె రెవెన్యూ సబ్ డివిజన్లో కలపనున్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ పెట్టిన ప్రతిపాదన మేరకు మండలాలను విభజిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసేందుకు మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2022 ఏప్రిల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన జరిగింది. అప్పట్లో మంత్రిగా వున్న పెద్దిరెడ్డి ప్రాబల్యంతో రాజంపేట పార్లమెంటు పరిధిలోని పుంగనూరును చిత్తూరు జిల్లాలోనే వుంచగలిగారు. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి చిత్తూరు పార్లమెంటులోని చంద్రగిరిని తిరుపతి జిల్లాలో కలుపుకున్నారు.తిరుపతికి చంద్రగిరి పక్కనుండడంతో అభ్యంతరాలు రాలేదు. పుంగనూరు విషయంలో మాత్రం ఎప్పట్నుంచో అభ్యంతరాలున్నాయి.పుంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా కేంద్రానికి దూరంగా ఉందని, అన్నమయ్య జిల్లా కేంద్రానికి, మదనపల్లె రెవెన్యూ సబ్ డివిజన్ కార్యాలయానికి దగ్గరంటున్న ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
నాలుగు రోజుల్లోనే ప్రతిపాదన, ఆమోదం
పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలనూ మదనపల్లె సబ్డివిజనులో కలపాలని నాలుగు రోజుల కిందట ప్రభుత్వానికి జిల్లా నుంచి ప్రపోజల్ వెళ్లింది. చిత్తూరుకు దగ్గరగా ఉన్న పులిచెర్ల మండలం మినహా పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, రొంపిచెర్ల మండలాలను మదనపల్లె డివిజనులో కలిపేందుకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చేందుకు మంగళవారం క్యాబినెట్ అనుమతించింది. ప్రస్తుతం పుంగనూరు, చౌడేపల్లె, సదుం, సోమల మండలాలు పలమనేరు డివిజనులో ఉండగా, రొంపిచెర్ల మండలం చిత్తూరు డివిజనులో ఉంది. ఈ విభజనతో 10 మండలాలుగా ఉన్న పలమనేరు డివిజనులో ఇక నుంచి 6 మండలాలే ఉంటాయి.
రెండు రకాల చర్చలు
ఈ విభజన పట్ల రాజకీయ, అధికార వర్గాల్లో రెండు కోణాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలతో మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేస్తారనే అంచనాలు బయటికొచ్చాయి. ఆ క్రమంలో పుంగనూరును మదనపల్లె డివిజనులో కలపడంతో జిల్లా ఏర్పాటుకు తొలి అడుగు పడిందా.. అన్న చర్చ మొదలైంది. అలాగే చిత్తూరు జిల్లాలో ప్రాబల్యం చూపిస్తున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని ఇరుకున పెట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని రాజకీయ వర్గాల భావన.
రెండు మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి
జిల్లాల విభజనతో విద్య, వైద్య, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలను కోల్పోయిన చిత్తూరు అనాథలా మారింది. దానికి తోడు నగరి నియోజకవర్గంలోని 5 మండలాల్లో రెండింటిని తిరుపతిలో కలిపేశారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా తిరుపతిలోకి మార్చారు. ఇప్పుడు పుంగనూరును అన్నమయ్య జిల్లాలోకి మార్చనున్నారు. దీంతో చిత్తూరు జిల్లా భౌగోళికంగా కూడా మరింత చిన్నదిగా మారిపోనుంది. 26 మండలాలతో అత్యంత చిన్న జిల్లాల్లో ఒకటిగా ఉండనుంది. రెండు మూడు నెలల్లో ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిపోతుందని అధికారులు చెబుతున్నారు.
కుప్పంలో రూ.5 కోట్లతో 1500 ఉద్యోగాలు
కుప్పం పారిశ్రామిక పార్కులో అలీప్ సంస్థ పెట్టే రూ.5 కోట్ల పెట్టుబడితో 1500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ‘రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు’ ఇటీవల నిర్వహించిన సమావేశంలో అలీప్ సంస్థకు భూముల కేటాయింపులు, ఇంధన, రహదారులు, నీళ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు చేసింది. దీన్ని మంగళవారం క్యాబినెట్ ఆమోదించింది.