Share News

AP CM Chandrababu: చౌకబారు విమర్శలను తిప్పికొట్టండి

ABN , Publish Date - May 05 , 2025 | 05:01 AM

టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు.సూపర్‌-6 హామీల అమలుతోపాటు అమరావతి పునరుద్ధరణపై దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించామన్నారు

AP CM Chandrababu: చౌకబారు విమర్శలను తిప్పికొట్టండి

ఏ మంచి కార్యక్రమం చేపట్టినా వైసీపీ దుష్ప్రచారం: చంద్రబాబు

  • ఈ నెలలోనే ‘అన్నదాతా సుఖీభవ’

  • జూన్‌ తొలి వారంలో ‘తల్లికి వందనం’

  • చదువుకునే పిల్లలకు రూ.15 వేలు

  • సూపర్‌-6 హామీలు అమలుచేస్తున్నాం

  • వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి

  • నామినేటెడ్‌ పదవుల్లో అధిక శాతం భర్తీ

  • త్వరలోనే మిగతావీ పూర్తి చేస్తాం

  • 18కల్లా సంస్థాగత నియామకాలు

  • మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీ

  • ప్రధాని సభతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అమరావతి: సీఎం

  • పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి జూన్‌ 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను టీడీపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

5 కోట్ల మంది ఆత్మగౌరవానికి అమరావతి ప్రతీక. యువతకు అవకాశాలు, ఉద్యోగాలు కల్పించే విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది.

- సీఎం చంద్రబాబు


అమరావతి మే 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తోందని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దాని దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపిచ్చారు. 11 నెలల్లోనే స్పష్టమైన మార్పులు చూపించి ప్రజలకు నమ్మకాన్ని కలిగించామన్నారు. గుజరాత్‌లో సుస్థిర ప్రభుత్వం ఉండడంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే మోడల్‌ ఆంధ్రలోనూ అమలవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆదివారం ఆయన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెలలోనే అన్నదాతా సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్నామని.. పాఠశాలలు తెరవడానికి ముందే జూన్‌ మొదటి వారంలో తల్లికి వందనం కింద.. చదువుకునే పిల్లలకు రూ.15 వేలు అందిస్తామని స్పష్టం చేశారు. సూపర్‌-6 హామీలు అమలు చేయడంతోపాటు ఆర్థిక, ఆర్థికేతర అంశాలను పరిష్కరిస్తున్నామన్నారు. ‘కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్లు, కో-ఆపరేటివ్‌, ఏఎంసీ చైర్మన్ల నామినేటెడ్‌ పదవుల్లో అధిక శాతం భర్తీ చేశాం. మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. సామాజిక న్యాయం పాటించి పదవులకు ఎంపిక చేస్తున్నాం. పార్టీ సంస్థాగత ఎన్నికలు కూడా నిర్వహించుకుంటున్నాం. రాష్ట్ర కమిటీలు మినహా అన్నిటి నియామకాలు ఈ నెల 18 నాటికి పూర్తవ్వాలి. ఈసారి మహానాడు కడపలో 27, 28, 29 తేదీల్లో నిర్వహించుకుంటున్నాం. ఆ తర్వాత రాష్ట్ర కమిటీని పూర్తి చేస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ సభ్యత్వాలు నమోదయ్యాయి. సభ్యత్వం తీసుకున్న వారికి కార్డులు కూడా వీలైనంత త్వరగా పంపిణీ చేయాలి. ప్రభుత్వానికి ఇచ్చినంత ప్రాధాన్యం పార్టీకి కూడా ఇస్తున్నా’ అని తెలిపారు.


అమరావతి సభ భేష్‌..

అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం చాలా బాగా జరిగిందన్న చంద్రబాబు.. సభ విజయవంతానికి కృషి చేసిన కార్యకర్తలు, నాయకులందరినీ అభినందించారు. ‘ప్రధాని మోదీ రాష్ట్రానికి గతంలో చాలాసార్లు వచ్చినప్పటికీ ఈసారి వాటన్నింటినీ మరిపించేలా ఈ సభ జరిగింది. రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమంతో దేశం, ప్రపంచం దృష్టి అమరావతిపైకి మళ్లింది. అమరావతి ఆవశ్యకతను తెలియజేసేందుకు, పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభించాం. వికసిత్‌ భారత్‌-2047కు అమరావతి బలమైన పునాదిగా మారుతుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు.. ప్రజారాజధాని నిర్మాణం ఇబ్బందుల్లేకుండా ముందుకెళ్తుందనడానికి సంకేతం. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రధాని మోదీ, నేను, పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల సమయంలో చెప్పాం. చెప్పినట్లుగానే గతితప్పిన రాష్ట్రాన్ని గాడినపెట్టాం. పోలవరానికి నిధులు రాబట్టి 2027 నాటికి పూర్తిచేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మూతబడే స్థితిలో ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఊపిరిపోసి.. కేంద్రం రూ.11,400 కోట్లు కేటాయించేలా చేశాం. ఉత్తరాంధ్రవాసుల కల రైల్వేజోన్‌ సాధించాం. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. బీపీసీఎల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌, సీమలో గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్స్‌, ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్‌ పార్కులను ఏర్పాటు చేసుకుంటున్నాం. లేపాక్షి-కొప్పర్తి కారిడార్‌ తీసుకొస్తాం. ఇటీవల 11 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ప్రారంభించాం. త్వరలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తాం. ప్రతి నెలా 1వ తేదీనే పేదలకు పింఛన్లు ఇస్తున్నాం. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశాం. దీపం-2 కింద కోటి మందికి ఏటా 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మత్స్యకారుల సేవలో పథకంలో భాగంగా కుటుంబానికి రూ.20 వేలు ఇచ్చాం’ అని వివరించారు.


క్రియేటర్‌ ల్యాండ్‌పై సీఎం హర్షం

క్రియేటివ్‌ ల్యాండ్‌ ఏసియాతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తంచేశారు. చరిత్రాత్మక ఎంవోయూ ద్వారా దేశంలోని మొట్టమొదటి ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ అయిన క్రియేటర్‌ ల్యాండ్‌ను అమరావతిలో నెలకొల్పనున్నట్లు ‘ఎక్స్‌’లో తెలిపారు. దీని ద్వారా 25 వేల ఉద్యోగాలను సృష్టించడంతోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను గణనీయంగా ఆకర్షించడమే లక్ష్యమన్నారు. అమరావతిలో భారతదేశ సృజనాత్మక పరిశ్రమకు ఇది ఉత్తేజకరమైన పరిణామమని.. సినిమా, గేమింగ్‌, సంగీతం, వర్చువల్‌ ప్రొడక్షన్‌, ఇమ్మర్సివ్‌ స్టోరీ టెల్లింగ్‌, ఏఐ ఆధారిత కంటెంట్‌పై దృష్టి సారించి, స్థానిక ప్రతిభను వెలికితీసేందుకు క్రియేటర్‌ ల్యాండ్‌ దోహదపడుతుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో భారీ వర్షం.. భక్తుల పరుగులు.. (ఫోటో గ్యాలరీ)

నకిలీ దేశ గురువు మాయాజాలం

For More AP News and Telugu News

Updated Date - May 05 , 2025 | 05:01 AM