CM Chandrababu: విషం చిమ్మడంలో గట్టు దాటారు
ABN , Publish Date - Jun 09 , 2025 | 03:17 AM
మీడియా విశ్లేషణల పేరుతో రాజధాని అమరావతి మహిళలపై దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టుదాటి ప్రవర్తించారని..

నీచ సంస్కృతికి చెక్ పెడతాం: సీఎం చంద్రబాబు
మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు క్షమించరాని నేరం
మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని నీచంగా మాట్లాడారు
రాజధానిపై విషం చిమ్మడంలో గట్టు దాటారు: చంద్రబాబు
అమరావతి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): మీడియా విశ్లేషణల పేరుతో రాజధాని అమరావతి మహిళలపై దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టుదాటి ప్రవర్తించారని, మన తల్లులు, చెల్లెళ్లపై ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. రాజధాని ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నా. తన సొంత మీడియా ద్వారా జరిగిన ఈ దారుణాన్ని మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరం. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టుదాటి మహిళల మనోభావాలను గాయపరచినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళలను గౌరవించి, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుంది’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.