Share News

AP CM Chandrababu: దేవదాయ లో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - May 07 , 2025 | 03:53 AM

దేవదాయ శాఖలో 137 ఉద్యోగాలు, 200 వైదిక సిబ్బంది భర్తీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు. 23 ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్, నిత్యాన్నదానం విస్తరణకు చర్యలు

AP CM Chandrababu: దేవదాయ లో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

  • 6 డిప్యూటీ కమిషనర్‌ పోస్టులు సహా

  • 137 ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం ఆదేశం

  • 200 వైదిక సిబ్బంది నియామకానికీ ఆమోదం

  • 16 ప్రముఖ ఆలయాల్లో నిత్యాన్నదానం అమలు

  • 23 ఆలయాల అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

  • దేవదాయ శాఖపై సమీక్షలో చంద్రబాబు ఆదేశాలు

  • ఖాళీలపై ‘ఆంధ్రజ్యోతి’లో పలుమార్లు కథనాలు

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్‌, గ్రేడ్‌-1, 3 ఈవోలతో సహా అన్ని పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. మంగళవారం ఆయన సచివాలయంలో దేవదాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింహాచలం ఘటనతో పాటు ఆలయాల నిర్వహణ, అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా దేవదాయ శాఖ, ఆలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. ఐదు విభాగాల్లో 137 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరు డిప్యూటీ కమిషనర్‌, 5 అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులతో పాటు ఆరు గ్రేడ్‌-1 ఈవో, 104 గ్రేడ్‌-3 ఈవో పోస్టులు, 16 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేయాలని సూచించారు. ఈ నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేసి ఆలయాలు సమర్థంగా నిర్వహించేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే 200 వరకు ఉన్న వైదిక సిబ్బంది ఖాళీలను కూడా అర్హులతో భర్తీ చేయాలని ఆదేశించారు. దేవదాయ శాఖలో పోస్టుల ఖాళీలపై ‘ఆంధ్రజ్యోతి’ పలుమార్లు పథకాలు ప్రచురించింది. సింహాచలం ఘటన తర్వాత కూడా ‘‘దేవుడి శాఖకు ఇన్‌చార్జిలే దిక్కు’’ శీర్షికన ప్రత్యేక కథనం ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం చంద్రబాబు శాఖలో అన్ని కేడర్లలోని పోస్టుల భర్తీ చేయాలని ఆదేశించారు.


అన్నప్రసాదం రుచిగా, నాణ్యతగా..

రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని సీఎం సమీక్షా సమావేశం సందర్భంగా అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో 23 ప్రధాన ఆలయాలు ఉండగా వీటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, బెజవాడ కనకదుర్గమ్మ, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం ఆలయాల్లో మాత్రమే నిత్యాన్నదానం జరుగుతోంది. మిగిలిన 16 ఆలయాల్లో కూడా భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం అమలు చేయాలని సీఎం ఆదేశించారు. అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిశుభ్రత ఉండేలా, భక్తులకు పవిత్ర భావన కలిగేలా అందించాలన్నారు. ఇందుకోసం వలంటరీగా వచ్చే వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అన్నప్రసాద కార్యక్రమానికి ఆదాయం సరిపోని ఆలయాలకు 7 ప్రధాన ఆలయాల నుంచి నిధులు సమకూర్చేలా చూడాలన్నారు. ‘తిరుమల వెంగమాంబ అన్నప్రసాదం తరహాలో ప్రమాణాలు పాటించాలి’ అని సూచించారు. అలాగే ప్రసాదాల నాణ్యతపైనా దృష్టి పెట్టాలని, ఆయా ఆలయాల ప్రసాదాల విశిష్టత కొనసాగేలా చూడాలని, నాణ్యతా పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించాలని సీఎం సృష్టం చేశారు.


టెంపుల్‌ టూరిజానికి ప్రణాళికలు

రాష్ట్రంలోని అన్ని ఆలయాలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మొదటి దశలో 23 ఆలయాలకు సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని సూచించారు. ఈ మాస్టర్‌ ప్లాన్‌ ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఉండాలని, టెంపుల్‌ టూరిజానికి గ్రోత్‌ ఇంజన్‌ అయ్యేలా చూడాలని నిర్దేశించారు. దేవాలయ భూములు ఆక్రమణకు గురికాకుండా, ఆస్తులను పరిరక్షించేలా, వాణిజ్య సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ఒక కమిటీ వేసి సమగ్ర విధానాన్ని తీసుకురావాలన్నారు. దీంతో వచ్చే ఆదాయాన్ని తిరిగి ఆలయాల అభివృద్ధికి వినియోగించాలన్నారు. ఈ క్రమంలో ఎక్కడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని, దేవదాయ భూములను హోటళ్లకు లీజుకు ఇచ్చినప్పుడు అక్కడ శాకాహారం మాత్రమే అందించేలా అనుమతి ఇవ్వాలని సృష్టం చేశారు. ‘బాలాజీ ఆలయ నిర్మాణ నిధి ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక కొత్త ఆలయం నిర్మాణం చేపట్టాలి. ఆలయాలను నిర్మించి, నిర్వహణను విస్మరించొద్దు. ఆలయ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా నిత్యం దూపదీప నైవేద్యాలు అందేలా చూడాలి. దేవాలయాలపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి’ అని నిర్దేశించారు. 6సీ కేటగిరి కింద నోటిఫైడ్‌ అయిన 24,538 ఆలయాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


తిరుపతి స్థాయిలో శ్రీశైల క్షేత్ర అభివృద్ధి

రాష్ట్రంలో ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం రెండూ కొలువైన ఒకే ఒక్క క్షేత్రం శ్రీశైలమని, తిరుపతి స్థాయిలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీశైలంలో దేవదాయ శాఖ భూములు పరిమితంగా ఉన్నందున ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు భూములు కేటాయింపులో ఆచితూచి వ్యవహరించాలని సృష్టం చేశారు. శ్రీశైలంలో వసతి గృహాలను ప్రభుత్వమే నిర్మించేలా చూడాలని చెప్పారు. అన్ని ఆలయాల్లో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. 6ఏ కేటగిరి ఆలయాల్లో ఇప్పటికే 19 వేల మొక్కలు నాటామని, అటవీ శాఖ సమన్వయంతో మిగిలిన ఆలయాల్లో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఆలయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా సెంట్రలైజ్డ్‌ శానిటేషన్‌ టెండర్లు పిలిచామన్నారు. 175 ఆలయాల్లో ఆన్‌లైన్‌ దర్శనం, సేవ, వసతి, ఈ -హుండీ వంటివి తీసుకువచ్చామన్నారు. రూ.7 కోట్ల ఆదాయం కన్నా ఎక్కువ వచ్చే 22 ఆలయాల్లో వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలు ప్రవేశపెట్టామని వివరించారు. కృష్ణా, గోదావరి హారతులు ప్రతినిత్యం కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొత్తం నోటిఫైడ్‌ ఆలయాలకు ఏడాదికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం వస్తోందని, అందులో రూ.850 కోట్లు టాప్‌ 7 ఆలయాల నుంచి సమకూరుతోందన్నారు. రూ.5 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాల నుంచి 9 శాతం మొత్తాన్ని కామన్‌ గుడ్‌ ఫండ్‌ కింద జమ చేస్తున్నామన్నారు. 2024-25లో సీజీఎ్‌ఫకు రూ.149 కోట్లు రాగా, రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో రూ.111 కోట్లతో 48 ముఖ్యమైన పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.


సీఎం నిర్ణయంపై నిరుద్యోగుల హర్షం

దేవదాయ శాఖలో ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుల భర్తీకి త్వరిగతిన నోటిఫికేషన్‌ ఇవ్వాలని వారు కోరుతున్నారు.దేవదాయ శాఖలో కీలకమైన డిప్యూటీ కమిషనర్‌ పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసి దాదాపు 29 ఏళ్లు అయింది. 1996లో చంద్రబాబు తొలు త ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు డీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. అప్పటి నుంచి మళ్లీ ఇప్పుడే డీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సీఎం ఆంగీకరించారు.

Updated Date - May 07 , 2025 | 06:23 AM