TTD laddu case: కల్తీ నెయ్యి కేసులో మరొకరు అరెస్ట్..
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:15 PM
తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. టీటీడీ మార్కెటింగ్ జీఎం సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. టీటీడీ మార్కెటింగ్ జీఎం సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. సుబ్రమణ్యంను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. సుబ్రమణ్యం అరెస్ట్తో ఈ కేసులో అరెస్ట్ల సంఖ్య.. మొత్తం 10కి చేరింది.
వైసీపీ హయాంలో తిరుమలలో లడ్డూ తయారీలో కల్తీకి పాల్పడ్డారన్న ఆరోపణలు తలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. 2019 - 2024 మధ్య 20.01 కోట్ల వేంకటేశ్వరస్వామి లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని సిట్ విచారణలో తేలింది. మొత్తం 48.76 కోట్ల లడ్డూలను తయారు చేయగా.. ఆ లడ్డూల్లో 40 శాతం పామాయిల్, పామ్కెర్నల్ ఆయిల్తో పాటూ ఇతర రసాయనాలతో తయారు చేశారని నిర్ధారణ అయింది. టీటీడీలోని అప్పటి ధర్మకర్తల మండలి నెయ్యి సరఫరా కోసం.. ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డెయిరీ, తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డెయిరీ, తిరుపతి జిల్లా పునబాకలోని వైష్ణవి డెయిరీతో పాటూ ఉత్తరప్రదేశ్కు చెందిన మాల్గంగ డెయిరీలకు రూ.250 కోట్లు చెల్లించింది.
ఈ డెయిరీల నుంచి మొత్తం 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేశారు. అయితే ఇందులో 68 లక్షల కిలోలు కల్తీ నెయ్యి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో రోజూ సుమారు 4 లక్షల లడ్డూలు తయారు చేస్తుంటారు. దీనికోసం 12 నుంచి 13 వేల కిలోల నెయ్యిని వాడాల్సి వస్తుంటుంది. కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు ఇటీవల టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నించిన విషం తెలిసిందే. హైదరాబాద్లోని వైవీ సుబ్బారెడ్డి నివాసంలో అధికారులు విచారణ చేశారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..
For More AP News And Telugu News