రాష్ట్రంలో రాజ్య హింస: సజ్జల
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:43 AM
వైసీపీ నేతలపై టీడీపీ నేతలు అక్రమ కేసులు పెడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు సబ్జైల్లో నందిగం సురేశ్ను ములాఖత్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

గుంటూరు సబ్ జైల్లో నందిగంతో ములాఖత్
గుంటూరు, జూన్ 2(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, లోకేశ్ల డైరెక్షన్లో టార్గెట్లు పెట్టి మరీ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు సబ్జైల్లో వున్న మాజీ ఎంపీ నందిగం సురేశ్తో ఆయన సోమవారం అర్ధగంటకు పైగా ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో రాజ్యహింస జరుగుతోంది. కేవలం వైసీపీ నేతలపై కావాలని ఏదో ఒక స్ర్కిప్ట్ తయారు చేసి కేసులు బనాయించి జైలుకు పంపే ప్రయత్నం కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేశ్పై అక్రమంగా 12 కేసులు బనాయించారు. మరో వైపు మాచర్లలో వైసీపీ నాయకుడు తురకా కిశోర్పై 8 కేసులు బనాయించారు. కొత్తగా మరొకటి ఫైల్ చేస్తున్నట్లు మాకు సమాచారం అందింది. నాలుగేళ్ల తరువాత మేం ఏం చేయాలో ఇప్పుడు టీడీపీ నేతలు నేర్పుతున్నారు. ఎల్లకాలం తమకే అధికారం ఉంటుందని చంద్రబాబు, లోకేశ్ అనుకోవద్దు. 3న తెనాలిలో పోలీసుల చేతుల్లో థర్డ్ డిగ్రీకి గురైన బాధితులను పరామర్శించేందుకు జగన్కు అనుమతి లేదు. కోర్టు ద్వారా అనుమతి పొందాలని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని సజ్జల అన్నారు. ఆయనవెంట ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రులు విడదల రజనీ, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, నేతలు నిమ్మకాయల రాజనారాయణ ఉన్నారు.