Aksharam Andaga Program: ప్రజా సమస్యల పరిష్కారమే ఆంధ్రజ్యోతి అజెండా
ABN , Publish Date - Jun 03 , 2025 | 02:46 AM
ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య చెప్పారు ప్రజల సమస్యల పరిష్కారం ముఖ్య అజెండాగా అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం రూపకల్పన చేయబడింది. తిరుమల నగర్లో పలు సమస్యలు పరిష్కరించగా, మిగిలిన వాటిపై కూడా కృషి కొనసాగుతోందని తెలిపారు.

ఇందుకోసమే ‘అక్షరం అండగా’కార్యక్రమానికి రూపకల్పన చేశాం
గాజువాక సభలో ‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ వేమూరి ఆదిత్య
‘ఆంధ్రజ్యోతి’ చొరవతో తిరుమలనగర్లో కాలుష్య, పలు సమస్యలు పరిష్కరించినట్టు వెల్లడి
మిగిలిన సమస్యల పరిష్కారానికీ కృషి: పల్లా
విశాఖపట్నం, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారమే అజెండాగా ‘ఆంధ్రజ్యోతి’ ముందుకు సాగుతుందని సంస్థ డైరెక్టర్ వేమూరి ఆదిత్య అన్నారు. సోమవారం విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గ పరిధిలోని తిరుమల నగర్ ఆర్య వైశ్య సామాజిక భవన్లో ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడారు. పత్రికలు చాలా వరకూ ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లడం వరకే పరిమితమవుతాయని, ‘ఆంధ్రజ్యోతి’ మాత్రం అక్కడితో సరిపెట్టుకోకుండా అవి పరిష్కారమయ్యేలా చూడాలనే ఉద్దేశం, లక్ష్యంతో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి నేరుగా తీసుకువెళ్లే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది జనవరి 28న తిరుమల నగర్లో సదస్సు నిర్వహించామన్నారు. ఆ సదస్సులో స్థానికులు తమ సమస్యలు చెప్పారని, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఆ సమస్యల జాబితా తయారు చేసుకుని వాటి పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ చొరవ తీసుకుందని చెప్పారు. ఆ రోజు సదస్సులో ప్రజలు లేవనెత్తిన సమస్యల్లో దాదాపు 80 శాతం పరిష్కారమయ్యాయని, మిగిలినవాటి పరిష్కారం కూడా పురోగతిలో ఉందని వివరించారు.
ప్రధానంగా అనధికార డంపింగ్ యార్డు మూతపడిందని తెలిపారు. లోఓ ల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. తిరుమల నగర్కు ఆర్టీసీ కొత్త బస్సు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి సహాయ సహకారాలు అందించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, 87వ డివిజన్ కార్పొరేటర్ బొండా జగన్, ఏపీఐఐసీ ఐలా కమిషనర్ అయినవిల్లి కిశోర్ , సౌత్ సబ్డివిజన్ ఏసీపీ టి.త్రినాథ్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, ఏపీఈపీడీసీఎల్ ఏఈ వీర్రాజు, రెవెన్యూ అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు స్టీల్ప్లాంటు డిపో నుంచి తిరుమల నగర్ మీదుగా దువ్వాడ రైల్వేస్టేషన్కు బస్సు సర్వీస్ను పల్లాతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. బస్సు ఎక్కి టికెట్ తీసుకుని కొంతదూరం ప్రయాణించారు. కార్యక్రమంలో సర్క్యులేషన్ డైరెక్టర్ టి.రామకృష్ణారావు, బ్రాంచ్ మేనేజర్ కె.రామకృష్ణారావు పాల్గొన్నారు.
సమష్ఠిగా పనిచేయాలి: పల్లా
‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సదస్సులో తిరుమల నగర్ వాసులు లేవనెత్తిన సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ప్రజలు లేవనెత్తిన ప్రధాన సమస్యలను ‘ఆంధ్రజ్యోతి’ చొరవతో సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించారన్నారు. మిగిలిన సమస్యలను కూడా పరిష్కారిస్తానన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకురావడమే కాకుండా.. అవి పరిష్కారమయ్యే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన ‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ వేమూరి ఆదిత్య సామాజిక స్పృహ అభినందనీయమన్నారు. సమాజంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్ఠిగా పనిచేయాలని, ‘ఆంధ్రజ్యోతి’ ప్రారంభించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’తో అది సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. సమాజం పట్ల వేమూరి ఆదిత్యకు ఉన్న అవగాహన తనను ఆకట్టుకుందన్నారు.