Operation Sidoor: వీర జవాన్ మురళీ ఫ్యామిలీకి బాలయ్య అండ.. నెల జీతాన్ని
ABN , Publish Date - May 10 , 2025 | 04:24 PM
Operation Sidoor: భారత్ - పాక్ యుద్ధ భూమిలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఎమ్మెల్యే బాలయ్య అండగా నిలిచారు. రేపు స్వగ్రామంలో జవాన్ అంత్యక్రియలు జరుగనున్నాయి.

శ్రీసత్యసాయి, మే 10: ఆపరేషన్ సిందూర్లో (Operation Sindoor) భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతూ అసువులు బాసిన తెలుగు జవాన్ మురళీ నాయక్కు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Balakrishna) అండగా నిలిచారు. జవాన్ కుటుంబానికి తన వంతుగా ఆర్థిక సాయం అందజేశారు. ఒక నెల జీతాన్ని మురళీనాయక్ కుటుంబానికి ఇస్తున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే. ఈనెల 12న (సోమవారం) మురళీ నాయక్ స్వగ్రామానికి ఎమ్మెల్యే బాలయ్య వ్యక్తిగత కార్యదర్శులు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి.. ఆపై బాలయ్య ప్రకటించిన నగదును వారికి అందిజేయనున్నారు.
మరోవైపు ఆపరేషన్ సిందూర్లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీనాయక్ మృతదేహం బెంగుళూరు ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఈరోజు సాయంత్రం జవాన్ స్వస్థలం గోరంట్ల మండలం కల్లితండాకు పార్థీవదేహం చేరుకోనుంది. బెంగళూరు ఎయిర్ పోర్ట్లో మురళీ నాయక్ భౌతికకాయానికి మంత్రి సవిత (Minister Savita) నివాళులర్పించారు. విమానాశ్రయం నుంచి జవాన్ భౌతికకాయాన్ని స్వయంగా మంత్రి సవితతో పాటు, సత్యసాయి జిల్లా అధికారులు స్వగ్రామానికి తీసుకువస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కొడికొండ చెక్పోస్టు నుంచి జవాన్ భౌతికకాయాన్ని భారీ ర్యాలీతో స్వగ్రామం వరకు తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివస్తున్నారు.
అంత్యక్రియలకు పవన్, లోకేష్
జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు రేపు(ఆదివారం) స్వగ్రామం కల్లితండాలో జరుగనున్నాయి. జవాన్ అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anita), మంత్రి నారా లోకేష్ (Minister lokesh) హాజరుకానున్నారు. గుమ్మయ్యగారిపల్లి నుంచి భారీ ర్యాలీని నిర్వహించిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాక్ జరిపిన కాల్పుల్లో మరణించిన నేపథ్యంలో అధికారిక, సైనిక లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం, మంత్రులు లోకేష్, అనిత హాజరుకానున్నారు. ముందుగా మురళీ నాయక్ భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం, మంత్రుల రాక నేపథ్యంలో కల్లితండాలో యుద్ధ ప్రాతిపదికన అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అంత్యక్రియల్లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, వీఐపీలు పాల్గొననున్నారు. వీఐపీల రాకతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
ఎమ్మెల్యే మేనల్లుడి ఆర్థిక సాయం
వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మేనల్లుడు దేవినేని ధర్మతేజ పరామర్శించారు. ఈ సందర్భంగా జవాన్ తల్లిదండ్రులకు ఒక నెల వేతనం ఆర్థిక సాయం చెక్ను ధర్మతేజ అందజేశారు. మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామంటూ కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు.
మహారాష్ట్ర మంత్రుల పరామర్శ
అలాగే మురళీనాయక్ కుటుంబాన్ని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్ పరామర్శించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వీడియో కాల్ ద్వారా మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించారు. వీర జవాన్ విగ్రహాన్ని మురళి నాయక్ జన్మస్థలమైన ముంబైలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: ఆర్మీకి విరాళాల వెల్లువ.. నెల జీతం ఇచ్చిన ఏపీ స్పీకర్
Operation Sindoor: ఇండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. తుస్సుమంటున్న పాక్ మిస్సైల్స్..
Read Latest AP News And Telugu News
థియేటర్లో దుమ్ములేపారుగా..