CM Chandrababu: భూమిపై మనకు తెలిసిన దైవ స్వరూపం సత్యసాయి బాబా..
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:40 PM
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. నాస్తికులను కూడా బాబా ఆధ్యాత్మికత వైపు నడిపించారన్నారు. మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయి బాబా నమ్మారని సీఎం తెలిపారు.
పుట్టపర్తి, నవంబర్ 19: ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపమన్నారు. లవ్ ఆల్.. సర్వ్ ఆల్.. హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్ అనేది శ్రీసత్యసాయి చూపిన దారి అని చెప్పుకొచ్చారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారని అన్నారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శతజయంతి వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు... ఆచరించారని.. అలాగే ఫలితం చూపించారని సీఎం వెల్లడించారు.
ప్రేమ ఒక్కటే మతం, హృదయం ఒక్కటే భాష, మానవత్వమే కులం, అన్నిచోట్లా దైవం ఉందని బోధించారని గుర్తుచేశారు. నాస్తికులను కూడా ఆధ్యాత్మికత వైపు నడిపించారన్నారు. వేర్వేరు దేశాలు వేర్వేరు ప్రాంతాల ప్రజలను మనో దర్శనంతో ప్రభావితం చేశారని సీఎం తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే ఆయన భావనతో శ్రీ సత్యసాయి భక్తులు మానవాళికి సేవలు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. భక్తుల్ని ఎంతో ప్రేమగా ‘బంగారూ’... అంటూ ఆయన పిలిచే పిలుపు ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. బాబాతో తనకు ఎన్నో అనుభవాలు ఉన్నాయని.. ట్రస్ట్ కార్యక్రమాలపై పలుమార్లు తనతో చర్చించారని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకూ ఉచితంగా అందించారన్నారు. 102 సత్యసాయి విద్యాలయాలు... 60,000 మందికి ఉత్తమ విద్యను అందిస్తున్నాయన్నారు.
సూపర్ స్పెషాలిటీ, జనరల్ ఆస్పత్రులు, మొబైల్ ఆస్పత్రుల ద్వారా రోజూ రోగులకు సేవలందుతున్నాయని తెలిపారు. రాయల సీమ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రశాంతి నిలయాన్ని తాకట్టుపెట్టి అయినా ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నారని ఆనాటి సంగతులను గుర్తుచేశారు. ఈ విషయం తెలిసి భక్తులు ముందుకు వచ్చి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారని తెలిపారు. రూ.550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు, 30 లక్షలకుపైగా జనాభాకు నీరిచ్చారన్నారు.
చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీంకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారని సీఎం తెలిపారు. సత్యసాయి స్ఫూర్తిని, ఆయన చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం భగవాన్ శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాగా.. శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. బాబా జయంతిని పురస్కరించుకుని రూ.100 విలువైన స్మారక నాణేన్ని ప్రధాని విడుదల చేశారు. అలాగే శ్రీసత్యసాయి స్మారక తపాలా బిళ్లల్ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి...
మావోలకు దెబ్బ మీద దెబ్బ... నిన్న హిడ్మా.. నేడు మరికొందరు
బాబా చూపిన బాటలోనే నడుద్దాం: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News