Share News

Amaravati Women Protest: భగ్గుమన్న మహిళా లోకం

ABN , Publish Date - Jun 09 , 2025 | 03:46 AM

అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు నోరు పారేసుకోవడంపై మహిళా లోకం భగ్గుమంది. రోత చానల్‌ లైవ్‌ డిబేట్‌లో అమరావతి మహిళలపై వారు చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.

Amaravati Women Protest: భగ్గుమన్న మహిళా లోకం

  • మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై పెల్లుబికిన నిరసనలు

  • కొమ్మినేని, కృష్ణంరాజులపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు

  • సాక్షి కార్యాలయాల ఎదుట తెలుగు మహిళల ధర్నాలు

  • భారతీరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

  • మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌కు అమరావతి జేఏసీ ఫిర్యాదు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు నోరు పారేసుకోవడంపై మహిళా లోకం భగ్గుమంది. రోత చానల్‌ లైవ్‌ డిబేట్‌లో అమరావతి మహిళలపై వారు చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుతో పాటు కొమ్మినేని శ్రీవాసరావును తక్షణం అరెస్టు చేయాలని తెలుగు మహిళలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పలు జిల్లాల్లోని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. ‘సాక్షి’ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసి, ఆ పత్రిక ప్రతులను దహనం చేశారు. ‘సాక్షి’ చానల్‌లో మహిళలను అగౌరవపరుస్తుంటే ఆ సంస్థ యాజమాని భారతీరెడ్డి ఎందుకు స్పందించలేదని నిలదీశారు. భారతీరెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళలను అగౌరపరిచేలా వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని కోరుతూ ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజకు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు, నేతలు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు రాష్ట్ర మహిళా విభాగం, ఎస్సీ సెల్‌, జనసేన, బీజేపీ, మానవ హక్కుల సంఘాల తరపున వేర్వేరుగా ఫిర్యాదులు అందజేశారు. ఈ ఘటనపై పరిశీలన చేస్తున్నామని, త్వరితగతిన చర్యలు ఉంటాయని చైర్‌పర్సన్‌ తెలిపారు.


నెల్లూరులో భారీ నిరసన ప్రదర్శన

నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ నుంచి వీఆర్‌సీ వరకు తెలుగు మహిళలు నల్లచీరలు ధరించి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజధానిపై విషం చిమ్ముతున్న సాక్షి పత్రిక, చానల్‌ను బ్యాన్‌ చేయాలని కోరారు. ఉమ్మడి అనంతపురం జిల్లా సాక్షి యూనిట్‌ కార్యాలయం ఎదుట తెలుగు మహిళలు నిరసనకు దిగారు. యూనిట్‌ కార్యాలయానికి ఉన్న ‘సాక్షి’ అక్షరాలను తొలగించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా వారిని అరెస్టు చేసి, పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాప్తాడులో తెలుగు మహిళలు పోలీసు స్టేషన్‌ ఎదుట నిరసన చేపట్టి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, జిల్లా ఎస్సీ సెల్‌ సెక్రటరీ ఖండవిల్లి లక్ష్మి ఆధ్వర్యంలో రాజానగరం సమీపంలోని సాక్షి పత్రిక కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.


ఏ ఒక్కరినీ వదిలిపెట్టం

అమరావతి రైతు సమన్వయ కమిటీ హెచ్చరిక

‘అమరావతి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడించిన సాక్షి చానల్‌ను, మాట్లాడినవారిని రైతు జేఏసీ వదిలిపెట్టదు. తగిన శాస్తి చేశాకే వారిని చట్టానికి అప్పగిస్తాం. భారతీ రెడ్డిని విమర్శించిన చేబ్రోలు కిరణ్‌ను హుటాహుటిన అరెస్టు చేసిన ప్రభుత్వం, కొమ్మినేనిని, కృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేయలేకపోయిందో చెప్పాలి’ అంటూ రాజధాని అమరావతి రైతు సమన్వయ కమిటీ భగ్గుమంది. రాజధాని పరిధిలోని తుళ్లూరులో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్‌, సాక్షి చానెల్‌ను, వారిపై చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తీరుపై కమిటీ నేతలు విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతిపై, మహిళలపై, రాష్ట్ర ప్రజల మీద తప్పుడు ప్రచారాలకు దిగితే, ఎంతటివారికైనా బడిత పూజ తప్పదని తెగేసి చెప్పారు. దీనిపై రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్‌కు, డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. న్యాయం జరగకపోతే అమరావతి ఉద్యమం తరహాలోనే మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అందుకు రాష్ట్ర మహిళా లోకం సిద్ధంగా ఉండాలని, తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కాగా, అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలను దారుణంగా కించపరిచిన కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్సీ సెల్‌ నేతలు, అమరావతి జేఏసీ మహిళలు గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - Jun 09 , 2025 | 03:50 AM