Minister Kandula Durgesh: అఖండ గోదావరి ప్రాజెక్టుకు జూన్లో శంకుస్థాపన
ABN , Publish Date - May 27 , 2025 | 04:55 AM
జూన్లో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుండగా, పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పర్యాటక అభివృద్ధికి భారీగా కేంద్ర నిధులతో హోటళ్లు, బోటు షికార్లు, టెంట్ సిటీల ఏర్పాట్లపై ప్రణాళికలు కొనసాగుతున్నాయి.

డిప్యూటీ సీఎం పవన్, ఎంపీ పురందేశ్వరి హాజరు
పోలవరం ప్రాజెక్టు వద్ద రెండు స్టార్ హోటళ్లు
గండికోట, సూర్యలంక ప్రాజెక్టు పనుల్లో కదలిక
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్
రాజమహేంద్రవరం, మే 26 (ఆంధ్రజ్యోతి): పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చేపడుతున్న అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు జూన్ మొదటి వారంలో శంకుస్థాపన చేస్తామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు మానసపుత్రిక అఖండగోదావరి ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటికే సుమారు రూ.100 కోట్లు ఇచ్చిందని.. పుష్కర ఘాట్ అభివృద్ధికి రూ.37 కోట్లతో టెండర్లు పిలిచామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హేవలాక్ బ్రిడ్జి, కొవ్వూరు గోష్పాద క్షేత్రం, కడియం నర్సరీలలో పర్యాటక అభివృద్ధి, నిడదవోలు, కడియపులంకలో బోటు షికారు, కోట సత్తెమ గుడి వద్ద భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనకు డిజైన్లు సిద్ధమవుతున్నాయని చెప్పారు. పుష్కరాల నాటికి రాష్ట్రంలో 50 వేల గదులు ఉండాలనే సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 7 వేల నుంచి 8 వేల గదులు సిద్ధం చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి రెండు స్టార్ హోటళ్లు నిర్మిస్తామన్నారు. కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టుకు టెండర్లు ఖరారయ్యాని, గుంటూరు జిల్లాలోని సూర్యలంక బీచ్ పనుల్లోనూ కదలిక వచ్చిందని చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మండువా లోగిళ్లను లీజుకు తీసుకుని, పర్యాటకులు అక్కడ స్టే చేసి, ఆయా ప్రాంతాలను సందర్శించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కుంభమేళా స్ఫూర్తితో రాష్ట్రంలో 21 ప్రధాన పుణ్యక్షేత్రాల వద్ద భక్తుల సౌకర్యార్థం టెంట్ సిటీలు, హోంస్టేలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గ జనసేన ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.