Kamareddy: చుక్క నీరు రాని 9 బోర్లు
ABN , Publish Date - May 04 , 2025 | 04:06 AM
కామారెడ్డి జిల్లాలో యువరైతు పెంటయ్య 9 బోర్లు వేసినా నీరు లభించక పంటలు ఎండిపోవడంతో తీవ్రంగా బాధపడి అప్పుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. నీటి కొరత, అప్పుల భారం ఒక రైతు ప్రాణాన్ని బలిగొంది

అప్పులు తీర్చలేక యువరైతు ఆత్మహత్య
దోమకొండ, మే 3 (ఆంధ్రజ్యోతి): పంటల సాగు కోసం పొలంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 బోర్లు వేసినా.. చుక్క నీరు పడక పంట ఎండిపోవడంతో మనస్థాపానికి గురైన ఓ యువరైతు.. చివరకు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన రైతు పంతులుగారి పెంటయ్య(27) తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో పంట పండించేందుకు నీరు లేకపోవడంతో బోరు వేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా లక్షల రూపాయలు అప్పులు తెచ్చి గత 15 నెలల వ్యవధిలో ఏకంగా 9 బోర్లు వేశాడు. అయినా బోర్ల నుంచి చుక్క నీరు కూడా పడలేదు. కొన్నేళ్ల క్రితం వేసిన బోరు నుంచే కొద్ది పాటి నీరు వస్తుండడం.. వాటితో పంట పండించేందుకు అనువుగా లేకపోవడం.. మరోవైపు రూ. 8.50 లక్షల వరకు అప్పులు కావడం.. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో పెంటయ్య శనివారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.